close
Choose your channels

కాంగ్రెస్‌లో చేరికల జోరు.. షర్మిల సమక్షంలో పార్టీలో చేరిన మరో వైసీపీ ఎమ్మెల్మే..

Saturday, April 6, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కాంగ్రెస్‌లో చేరికల జోరు.. షర్మిల సమక్షంలో పార్టీలో చేరిన మరో వైసీపీ ఎమ్మెల్మే..

ఏపీలో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తుంది. నాయకుల ప్రచారాలతో రాష్ట్రమంతా మైకులతో మార్మోగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి కూడా వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. తాజాగా మరో ఎమ్మెల్యే హస్తం కండువా కప్పుకున్నారు. అధికార పార్టీలో అవమానాలు భరించలేక వీరంతా బయటకు వస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే తమ సొంతగూటికి తిరిగి చేరుకుంటున్నామని పేర్కొంటున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆ జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన బాబుకు ఈ ఎన్నికల్లో సీఎం జగన్ టికెట్ నిరాకరించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన బహిరంగంగానే పార్టీ పెద్దలపై విమర్శలు చేశారు. పార్టీలో దళితులకు విలువ లేదని.. చాలా చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి హహ నడుస్తోందని.. ఆయనకు చెప్పినవారినే అందలం ఎక్కిస్తున్నారని ఆరోపించారు.

అయితే పార్టీ పెద్దల జోక్యంతో సైలెంట్ అయిపోయారు. కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైపోయారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్ షర్మిల బస్సు యాత్రలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతకుముందు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు జగన్‌కు లేఖ రాశారు. పార్టీలో అవమానాలు భరించలేక రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీకాకుళం ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా సేవలందించారు. వైయస్సార్ శిష్యురాలిగా గుర్తింపు పొందారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే నందికొట్కూర్ ఎమ్మెల్యే ఆర్థర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, యర్రగొండపాలెం టీడీపీ నాయకురాలు బూడిద అజితారావు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో ఆర్థర్, ఎలీజా, మురళీకృష్ణలు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం తొలి జాబితాలో వీరి పేర్లు ప్రకటించింది. మిగిలిన జాబితాల్లో ప్రస్తుతం పార్టీలో చేరుతున్న నాయకులకు చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. కీలక నేతలు తిరిగి సొంతగూటికి వస్తుండటంతో కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్ నెలకొంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.