close
Choose your channels

PV Narasimha Rao:పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటనపై ప్రముఖుల హర్షం

Friday, February 9, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు జాతి ముద్దు బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న(BharatRatna) ప్రకటించడంపై పార్టీలకు అతీతంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇది తెలుగు జాతికి దక్కిన గౌరవం అని కొనియాడుతున్నారు. తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డకు భారతరత్న రావడం సంతోషకరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

"దేశంలో ఆర్థిక సంస్కరణలకు బీజం వేసి, భారత్ ను అభివృద్ధి పథం వైపు పరుగులు తీయించిన గొప్ప దార్శనికుడు శ్రీ పీవీ నరసింహారావు గారు. బహు భాషా కోవిదుడు అయిన శ్రీ పీవీ నరసింహారావు గారు మౌనంగానే సంస్కరణలను చేపట్టి దేశ ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టారు. ఆర్థిక సంస్కరణలతో నూతన దశ దిశ కల్పించారు. వారు తెలుగు వారవటం మనందరికీ గర్వకారణం" అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు.

'తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని, ఆర్థిక మేధావి, బహుభాషా కోవిదుడు పి.వి.నరసింహారావు గారికి భారతరత్న దక్కడం గర్వించదగ్గ విషయం. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్.కె.అద్వానీ, కర్పూరీ ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్ గార్లకు భారతరత్న రావడం సంతోషకరం' అని రేవంత్ ట్వీట్ చేశారు.

భారతరత్న వంటి అత్యున్నత పౌర పురస్కారానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అన్ని విధాలా అర్హులని ఏపీ సీఎం జగన్ కొనియాడారు. అందుకే అన్ని వర్గాల నుంచి అభినందనల వర్షం కురుస్తోందన్నారు. ఉన్నతస్థాయి రాజకీయ, నైతిక విలువలు కలిగిన ఓ రాజనీతి కోవిదుడికి భారతరత్న ప్రకటించడం తెలుగు ప్రజలందరికీ లభించిన గౌరవం అని వెల్లడించారు.

పీవీ నరసింహారావుకు భారతరత్న దక్కడంపై బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవమన్నారు. బీఆర్ఎస్ డిమాండ్‌ను గౌరవించి పీవీకి భారతరత్న ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.

బహుభాషా కోవిదుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో పీవీ నాయకత్వం, చేపట్టిన సంస్కరణలు దేశానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని కొనియాడారు. భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తుల్లో పీవీ ఒకరని అభిప్రాయపడ్డారు. పీవీ నరసింహారావు ఇచ్చిన స్ఫూర్తితో తానూ పలు కార్యక్రమాలు చేపట్టినట్లు బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు.

"భారత ఆర్థిక వ్యవస్థను తన ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ ద్వారా ప్రపంచంలోనే ఆర్థికంగా బలమైన నాలుగవ దేశంగా భారత్ రూపుదిద్దుకుంది.తన చివరి శ్వాస వరకు దేశం కోసం శ్రమించిన గొప్ప రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వర్గీయ పీవీ నరసింహారావు గారికి భారతరత్న దక్కడం కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా భావిస్తున్నాం. మా పోరాటాన్ని, ప్రయత్నాన్ని సుదీర్ఘకాలం తర్వాత గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు" అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ట్వీట్ చేశారు.

"గొప్ప రాజనీతిజ్ఞుడు, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా ఆధునిక భారతదేశాన్ని తీర్చిదిద్దిన... భారత్ బలమైన ఆర్థిక శక్తిగా మారడానికి పునాదివేసిన పి.వి.నరసింహారావుకు భారతరత్న రావడం తెలుగువారందరికీ గర్వకారణం. తెలుగువారే కాదు భారతీయులంతా ఆనందించే విషయం"అంటూ చిరంజీవి పేర్కొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos