close
Choose your channels

భారత్‌లో కరోనా.. హైదరాబాద్‌కూ వచ్చేసింది!

Monday, March 2, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భారత్‌లో కరోనా.. హైదరాబాద్‌కూ వచ్చేసింది!

కరోనా వైరస్ లేదా కోవిడ్-19 పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలంగాణలో సైతం వచ్చేసింది. మరోవైపు ఢిల్లీలో కూడా ఈ వైరస్‌ ఒకరిద్దరికి సోకినట్లు వైద్యులు నిర్దారణకు వచ్చారు. ఇలాంటి వార్తలు విన్న జనాలు గజ గజ వణికిపోతున్నారు. ఇన్నాళ్లు ఈ వైరస్‌కు దూరంగా ఉన్న భారత్‌కు వచ్చేసింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకడం తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతోంది.

హైదరాబాద్‌కు ఎలా వచ్చింది!?
హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కంపెనీ పని మీద ఫిబ్రవరి 15న దుబాయ్‌కి వెళ్లగా.. అక్కడ నాలుగైదు రోజుల పాటు హాంగ్‌కాంగ్‌కు చెందిన వ్యక్తులతో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 20న బెంగళూరుకు వచ్చాడు. అనంతరం బస్సులో ప్రయాణించి ఫిబ్రవరి 22న హైదరాబాద్‌కు చేరుకున్నాడు. జ్వరం రావడంతో సికింద్రాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి ఔట్ పేషెంట్‌గా వెళ్లాడు. టెస్టుల తర్వాత అనుమానం రావడంతో.. గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. శాంపిల్స్‌ను పుణె వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తే కోవిడ్-19 సోకినట్లు నిర్ధారించారు. ఈ విషయాలను తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నిశితంగా మీడియాకు వెల్లడించారు.

కరోనావైరస్ సోకిన ఆ వ్యక్తి ఎవరంటే..?
‘అతడ్ని గాంధీ ఆస్పత్రిలో ఐసోలేటెడ్ వార్డులో చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అసవరంలేదు. మన వాతావరణ పరిస్థితుల్లో ఆ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదు. తుమ్ములు, దగ్గు, జ్వరం ఉంటే ఆస్పత్రికి వెళ్లి చూపించుకొండి. బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్‌లు ధరించాలి’ అని ఈటెల రాజేందర్ తెలిపారు.

కరోనాపై కేంద్రం స్పందన..!
ఇవాళ భారత్‌లో రెండు కరోనా కేసులు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మీడియాకు వెల్లడించారు. ‘ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన ఓ వ్యక్తికి, దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన మరో వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు వైద్యపరీక్షల్లో తేలింది. 21 ప్రధాన విమానాశ్రయాల్లో, 12 ముఖ్య ఓడరేవుల్లో, 65 చిన్నతరహా ఓడరేవుల్లో ప్రయాణికులకు కరోనా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నాం. విమానాశ్రయాల్లో ఇప్పటివరకూ 5,57,431 మంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించాం. 12,431 మందికి ఓడరేవుల్లో వైద్య పరీక్షలు చేశాం. దేశాలకు పర్యటించడంపై ఆంక్షలు కొనసాగిస్తున్నాం. చైనా, ఇరాన్, సింగపూర్, కొరియా, ఇటలీ దేశాలకు వెళ్లవద్దు’ అని ఈ సందర్భంగా భారతీయులకు కేంద్ర మంత్రి సూచించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.