close
Choose your channels

గొర్రెకుంట హత్య కేసుల నిందితుడికి ఉరిశిక్ష ఖరారు

Wednesday, October 28, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గొర్రెకుంట హత్య కేసుల నిందితుడికి ఉరిశిక్ష ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్‌కు ఉరిశిక్ష విధిస్తూ వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జయ్‌కుమార్ తీర్పు ప్రకటించారు. ఈ ఏడాది మే 20న వరంగల్ నగర శివారులోని గొర్రెకుంట బావిలో తొమ్మిది మందికి ఆహారంలో విషం కలిపి సజీవంగానే సంజయ్ బావిలో పడేసి హత్య చేశాడు. ఈ కేసులో విచారణ పూర్తైంది.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణ నిందితుడిపై అభియోగాలను నిరూపించడంతో ఉరిశిక్ష ఖరారు చేస్తూ వరంగల్ జిల్లా కోర్టు న్యాయమూర్తి జయకుమార్ తీర్పును వెలువరించారు. ఈ కేసులో నిందితుడిపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు 25 రోజుల్లోనే చార్జీషీట్ దాఖలు చేశారు. 57మంది వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కాల్ డేటా రికార్డింగ్ ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు తొమ్మిది మందిని దారుణంగా హత్య చేసిన నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించడంపై సర్వత్రా హర్షంవ్యక్తమవుతోంది. బాధిత కుటుంబాలకు న్యాయం జరగడంతో పోలీసులు సైతం పరస్పరం స్వీట్స్ పంచుకున్నారు.

కాగా.. హైదరాబాద్ నగర శివారులో గోనె సంచుల తయారీ కేంద్రంలో పని చేసే మక్సూద్, అతని బార్య నిషాకు బిహార్‌కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే నిషా అక్క కూతురు రఫీకా(30)తో సంజయ్ కుమార్‌కు ఏర్పడిన పరిచయంతో ఆమెతో సహజీవనం కొనసాగించాడు. రఫీకా భర్త నుంచి విడిపోయింది. ఆమెకు ముగ్గురు పిల్లలు. రఫీకాతో సహజీవనం చేస్తూనే సంజయ్.. ఆమె కూతురికి కూడా దగ్గరయ్యాడు. దీంతో పలుమార్లు రఫీకా, సంజయ్‌ల మధ్య గొడవ జరిగింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి కూతురికి సన్నిహితంగా ఉండటంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో రఫీకా అడ్డు తొలగించుకోవాలనే నిర్ణయానికి సంజయ్ వచ్చాడు.

పెళ్లి విషయాన్ని తమ కుటుంబ సభ్యులతో మాట్లాడదామని నమ్మబలికి రఫీకాను తీసుకుని మార్చిలో విశాఖ వెళ్లే గరీబ్ రథ్ రైలు ఎక్కాడు. దారిలో మజ్జిగ ప్యాకెట్లు కొని వాటిలో నిద్రమాత్రలు కలిపి ఆమెకు అందించాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఆమెను రైలు నుంచి తోసేసి తిరిగి గీసుకొండ చేరుకున్నాడు. అయితే రఫీకా గురించి నిషా.. సంజయ్‌ను నిలదీయడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించింది. దీంతో మక్సూద్ కుటుంబాన్ని సైతం హతమార్చాలనే నిర్ణయానికి సంజయ్ వచ్చాడు. ఐదు రోజుల పాటు రెక్కీ నిర్వహించాడు.

మే 20 మక్సూద్ మొదటి కుమారుడు షాబాజ్ పుట్టినరోజు కావడంతో అదే రోజు వారందరినీ చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. ఆ రోజు వారి ఇంటికి వెళ్లి వారితో మంచిగా ఉండి తయారు చేసుకున్న భోజనంలో 60 నిద్రమాత్రలు కలిపాడు. ఇది తిన్న వారంతా నిద్రలోకి జారుకున్నారు. అనంతరం ఒక్కొక్కరినీ గోదాము పక్కనే ఉన్న బావిలో పడేసి ఇంటికెళ్లి పోయాడు. బావిలో పడి మక్సూద్(50), నిషా(45), కుమార్తె బుస్ర(20), బుస్ర కుమారుడు(3), షాబాద్(22), సొహైల్(20) అలాగే ఈ కుటుంబానికి సంబంధం లేని శ్యామ్(22), శ్రీరామ్(20)లు మృతి చెందారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.