close
Choose your channels

ఆ కల నిజం చేసుకుంటున్నాం.. తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కు శుభాకాంక్షలు: రామ్ చరణ్

Friday, June 2, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆ కల నిజం చేసుకుంటున్నాం.. తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కు శుభాకాంక్షలు: రామ్ చరణ్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ వ్యవహారంపై ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో అన్ని రంగాల్లో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించింది. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా.. తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌ అందరికీ నా శుభకాంక్షలు ’’ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.

తెలంగాణ కీర్తి అజరామరమన్న పవన్ కల్యాణ్:

అంతకుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ వాసులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నేటి నుంచి 22వ తేదీ వరకు సాగే ఈ దశాబ్ది ఉత్సవాలు చరిత్రాత్మకమైనవి. ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. అటువంటి త్యాగధనులందరికీ నివాళులు అర్పిస్తున్నాను. పేదరికం లేని తెలంగాణా ఆవిష్కృతం కావాలనీ, రైతులు, కర్షకులు, కార్మికులతోపాటు.. ఈ నేలపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం సాగించాలని కాంక్షిస్తూ.. తెలంగాణ ఖ్యాతి, కీర్తి అజరామరంగా భాసిల్లాలని కోరుకుంటున్నాను ’’ అంటూ పవన్ పేర్కొన్నారు.

శంకర్ దర్శకత్వంలో నటిస్తోన్న చరణ్:

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 170 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సల్మాన్, వెంకీలతో చరణ్ స్టెప్పులు:

అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’’ చిత్రంలో చరణ్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. తెలుగు అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేశ్ సైతం కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాలో సల్మాన్, వెంకటేష్‌లతో కలిసి చరణ్ వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ‘‘ఏంటమ్మా’’ అంటూ సాగే పాటలో లుంగీ కట్టి మాస్ లుక్‌లో ఇరగదీశాడు మన గ్లోబల్ స్టార్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.