close
Choose your channels

Mehreen :పెళ్లి కాకుండానే పిల్లలను కనేందుకు.. హీరోయిన్ మెహ్రీన్ షాకింగ్ నిర్ణయం..

Tuesday, April 30, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. నేచురల్ స్టార్ నాని నటించిన 'కృష్ణ గాడి వీర ప్రేమగాథ' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా హిట్‌తో మరిన్ని అవకాశాలతో దూసుకుపోయింది. మహానుభావుడు, ఎఫ్‌2, ఎఫ్‌3, రాజా ది గ్రేట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది.

నిజానికి పెళ్లి తర్వాత సినిమాల్లో నటించను అని ఆ సమయంలో ఓపెన్‌గా చెప్పేసింది. అయితే ఏమైందో ఏమో కానీ తర్వాత భవ్య బిష్ణోయ్‌తో తన వివాహం రద్దు చేసుకున్నాను అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే తర్వాత సినిమా అవకాశాలు తగ్గడంతో అప్పటి నుంచి సోషల్ మీడియాకే పరిమితమైంది. ఈ క్రమంలో తన వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకుంది. తాను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు తన ఇన్‌స్టా అకౌంట్‌లో ఓ పోస్ట్ చేసింది.

"గ‌త రెండు సంవ‌త్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా.. చివరకు ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ పూర్తి అయ్యింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ విష‌యాన్ని అంద‌రితో పంచుకోవాలా వద్దా అని అనేక సార్ల ఆలోచించాను. కానీ నాలాంటి మ‌హిళ‌లు చాలా మంది ఈ ప్రపంచంలో ఉన్నారని తెలిసింది. పెళ్లి, పిల్లలు కనే విష‌యంలో వాళ్లు సొంత డెసిష‌న్ తీసుకోలేక‌పోతున్నారు. కానీ నా లైఫ్ అలా అవ్వాల‌ని అనుకోలేదు. వారి కోసమే నేను ఈ ప్రకటన చేస్తున్నాను. భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యమని భావించాను. అందుకే ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నా. దీని గురించి మాట్లాడడం నిషిద్ధం కాబట్టి ఎక్కువగా నేను మాట్లాడను.

సాంకేతికత సహాయంతో, మన కోసం మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాము. ఇలాంటిది ఎందుకు చేయించుకోకూడదు. తల్లి కావాలనేది నా కల. కొన్నిసార్లు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇదొక సవాల్ లాంటింది. ముఖ్యంగా సూదులు, రక్తం, ఆసుపత్రులంటే ఫోబియా ఉన్న నాలాంటి వారికి. నేను ఆసుపత్రికి వెళ్లిన ప్రతిసారీ మూర్ఛపోతాను. అన్ని హార్మోన్ల ఇంజెక్షన్లతో తీవ్ర ఇబ్బందిగా ఉన్నా అది విలువైనది. మీరు ఏ పనిని ఎంచుకున్నా, మీ కోసం చేయండి. తల్లి కావాలనే నా కోరికను నెరవేర్చుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నాకు అండ‌గా నిలిచిన నా గైనకాలజిస్ట్ డాక్టర్ రిమ్మీ, మా అమ్మకు థ్యాంక్స్" అంటూ చెప్పుకొచ్చింది.

'ఎగ్ ఫ్రిజింగ్' అంటే ఏమిటి..?

కడుపులో ఉన్న అండాలను బయటికి తీసి అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిలువ ఉంచడాన్ని ‘ఎగ్‌ ఫ్రీజింగ్‌’ అంటారు. దీనినే ‘క్రయో ఫ్రీజింగ్‌’ అని కూడా వ్యవహరిస్తారు. పుట్టుకతోనే ఆడపిల్ల కడుపులో అండాలు ఉంటాయి. ఉదాహరణకు పాప జన్మించినప్పుడు సుమారు 10 లక్షల అండాలు ఉంటే, రజస్వల సమయానికి 40-50 వేలకు పడిపోతాయి. మిగిలిన అండాల్లోంచి బయటికి విడుదల అయ్యేందుకు ప్రతినెలా సుమారు 300 అండాలు పోటీ పడతాయి. అందులో బలమైన అండమే అంతిమంగా విడుదల అవుతుంది. అంటే మహిళలకు 30 సంవత్సరాలు దాటిన తర్వాత అండాల్లో నాణ్యత తగ్గిపోతూ వస్తుంది. దీంతో ప్రస్తుత టెక్నాలజీ ద్వారా చిన్న వయసులోనే అండాలను దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక ఇంజెక్షన్‌ ఇచ్చి అండాలు మెచ్యూర్‌ అయ్యేలా చేస్తారు. అలా మెచ్యూర్‌ అయిన అండాలను సేకరించి అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద భద్రపరుస్తారు. వీటిని IVF లాంటి పద్ధతుల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫలదీకరణం చెందించి బిడ్డకు జన్మను ఇవ్వొచు. ఇప్పుడు మెహ్రీన్ కూడా ఇదే పద్ధతి ఎంచుకుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.