Harirama Jogaiah: జనసేనకు ఈ సీట్లు కేటాయించాల్సిందే.. చంద్రబాబుకు హరిరామ జోగయ్య అల్టిమేటం..


Send us your feedback to audioarticles@vaarta.com


ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఓవైపు అధికార వైసీపీ అభ్యర్థుల ప్రకటనతో పాటు సిద్ధం సభలతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లుతుంటే.. మరోవైపు టీడీపీ-జనసేన మాత్రం సీట్ల సర్దుబాటుపైనే కాలం వెళ్లతీస్తున్నాయి. మరో 20 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలోనూ రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ తేలడం లేదు. ఇప్పటికే చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు మార్లు కలిసి చర్చించారు. అయితే పవన్ అడిగినన్ని సీట్లను కాకుండా చంద్రబాబు తగ్గిస్తూ వస్తున్నారు. దీంతో జనసైనికులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
పవన్కి జోగయ్య సూచనలు..
ఈ క్రమంలోనే కాపు సీనియర్ నేత, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య.. పవన్కల్యాణ్కు మరోసారి బహిరంగ లేఖ రాశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం-జనసేన మధ్య సీట్లను ఎలా కేటాయించనున్నారనే ఆసక్తి రెండు పార్టీల క్యాడర్లో నెలకొందని తెలిపారు. 175 నియోజకవర్గాల్లో సీట్లు ఎలా కేటాయించాలనే చర్చల సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయిస్తారనే చర్చ జరుగుతోందన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ సామాజికవర్గం ఓటర్లే ఎక్కువ అనే ఎవరూ కాదనలేని సత్యం అన్నారు. అందులో 90 శాతం ఓట్లు ఈ కూటమికే పడాలంటే జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గవద్దని పవన్కి సూచించారు.
చంద్రబాబు బాధ్యత వహించాలి..
ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవాలన్నా జనసైనికుల మద్దతు అవసరమని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఓ ఎంపీ స్థానాన్ని జనసేనకు కేటాయించాలని జోగయ్య కోరుతున్నారు. నరసాపురం,భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం,నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, ఉండి, పోలవరం,గోపాలపురం,కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నరసాపురం పార్లమెంట్ను కూడా జనసేనకు కేటాయించాలని ఆయన పూచించారు. ఈ విషయంలో పవన్.. ఒక మెట్టు దిగినా ఒప్పుకునేదిలేదని తేల్చిచెప్పారు.ఒకవేళ ఇలా కాదని టీడీపీకి ఎక్కువ సీట్లు కేటాయిస్తే ఆ తరువాత జరిగే నష్టానికి చంద్రబాబు బాధ్యత వహించాల్సి ఉంటుందని లేఖలో హెచ్చరించారు. దీంతో జోగయ్య లేఖ కూటమిలో కలకలం రేపుతోంది.
బాబు వైఖరిపై జనసైనికులు ఆగ్రహం..
వాస్తవంగా ఉభయ గోదావరి జిల్లాలో పాటు కోస్తాంధ్రలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జనసేన సపోర్ట్ లేకుండా గెలవలేరని పోయిన ఎన్నికల్లో నిరూపితమైంది. అందుకే జనసేనతో పొత్తుకు చంద్రబాబు పాకులాడారని... అయితే పొత్తు కుదిరాక బాబులోని నిజస్వరూపం బయటకొచ్చిందని జనసైనికులు మండిపడుతున్నారు. తమ అధినేత పవన్ కల్యాణ్ పట్ల చంద్రబాబు వైఖరిని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జనసేనకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. పొత్తు ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నారని ఫైర్ అవుతున్నారు.
పోలింగ్ లోపు పొత్తు కొనసాగేనా..?
గతంలో ఇలాగే మండపేట, అరకు సీట్లను చంద్రబాబు ప్రకటించారని.. అప్పుడు పవన్ హెచ్చరించినా ఆయన వైఖరిలో మార్పు రాలేదంటున్నారు. ఇప్పుడు హరిరామజోగయ్య సూచించినట్లు పశ్చిమ గోదావరి జిల్లాలో 11 అసెంబ్లీ, ఓ ఎంపీ స్థానం కేటాయించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో టీడీపీ అభ్యర్థులను ఓడించి తీరుతామని శపథం చేస్తున్నారు. మొత్తానికి టీడీపీ-జనసేన పొత్తు పోలింగ్ లోపే బెడిసికొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com