‘అన్న’ అలా.. ‘తమ్ముడు’ ఇలా.. కోమటి బ్రదర్స్ దారెటు!
Send us your feedback to audioarticles@vaarta.com
కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారంటూ గత కొన్నిరోజులు పెద్ద ఎత్తున వార్తలు రావడంతో పాటు.. ఇటీవల రాజగోపాల్ రెడ్డి ఈ వ్యవహారంపై దాదాపు కన్ఫామ్ చేసేసిన సంగతి తెలిసిందే. అయితే తమ్ముడు మాత్రం కాంగ్రెస్కు టాటా చెప్పే యోచనలో ఉండగా.. అన్న మాత్రం కట్టె కాలే వరకు కాంగ్రెస్లోనే ఉంటానని శపథం చేశారు. దీంతో ‘తమ్ముడు’ అలా.. ‘అన్న’ ఇలా చేస్తుండటంతో అభిమానులు ఏం జరుగుతోందో దిక్కు తోచట్లేదు. ఒకే ఇంట్లో ఇలా ఎందుకు జరుగుతోంది..? అసలేంటి ఈ వ్యవహారం..? అని సొంత కుటుంబ సభ్యులకు సైతం అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. అయితే ఈ పుకార్లు, మీడియాలో వస్తున్న వార్తలన్నింటికీ.. ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇస్తారని అందరూ భావించారు. ఉన్నట్టుండి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ప్రత్యక్షమవ్వడంతో ఇక చేరిక కన్ఫామ్ అయిపోయినట్లేనని గుసగుసలు వినిపించాయి. అయితే తెలంగాణలో ఒక మాట.. ఢిల్లీలో మరో మాటతో రాజగోపాల్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు.
అబ్బే అదేం లేదు..!
ఢిల్లీ వేదికగా రాజగోపాల్ మీడియాతో ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. "నా ఢిల్లీ పర్యటనకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. అన్న భువనగిరి నుంచి గెలిచిన ఎంపీగా వెంకటరెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా నేను ఢిల్లీకి వచ్చాను. నేను బీజేపీలో చేరికపై ఇంకా ఫైనల్గా నిర్ణయం తీసుకోలేదు. ఏ నిర్ణయం తీసుకున్నా, అభిమానులు కార్యకర్తలను సంప్రదించిన తర్వాతే తీసుకుంటాను.. అంతేకాని నేను స్వతహాగా నిర్ణయం తీసుకోను. ఆంధ్రప్రదేశ్లో జగన్ మోహన్ రెడ్డి తరహాలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేసి ఉంటే అధికారంలోకి వచ్చి ఉండేది. నాకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి ఉంటే కూడా హస్తం పార్టీకి ఈ గతి పట్టేది కాదు" అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కాగా... సోమవారం నాడు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా పలువురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
అన్న రియాక్ట్ అవ్వడేం!
అయితే బాహాటంగా తమ్ముడు కాంగ్రెస్పై సంచలన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇంత జరుగుతున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం రియాక్ట్ కాకపోవడం వెనుక సమ్థింగ్ ఈజ్ రాంగ్ అని అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే కోమటిరెడ్డి బ్రదర్స్ లేదా రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం అనుకుంటోందని అందుకే ఆయన్ను ఢిల్లీకి పిలిపించిందని మరోవైపు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరో రెండ్రోజుల్లో అసలు కాంగ్రెస్ పగ్గాలు కోమటిరెడ్డి బ్రదర్స్ చేతికి వస్తాయా..? లేకుంటే కమలం కండువా కప్పుకుని ఎంచక్కా వెళ్లిపోతారా..? అనేదానిపై స్పష్టత రావాలంటే వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.