విజయదశమి కానుకగా పేదలకు సొంతింటి కల సాకారం: కేటీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ప్రభుత్వం విజయదశమి కానుకగా పేదలకు సొంతింటి కలను సాకారం చేసిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ జియాగూడ డిగ్నిటీ హౌసింగ్ కాలనీని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిగ్నిటీ హౌసింగ్ కాలనీలో 840 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించినట్టు తెలిపారు. దీనికోసం రూ.71.49 కోట్లు ఖర్చైందని ఆయన వెల్లడించారు. ఈ కాలనీలలో ఇళ్లను నిరుపేదలకు అవసరమైన అన్ని వసతులతో నిర్మించినట్టు వెల్లడించారు.
తాగునీరు, సీసీ రోడ్లు, షాపింగ్ కాంప్లెక్స్, హాస్పిటల్ వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందని కేటీఆర్ తెలిపారు. 560 చదరపు అడుగులలో ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించినట్టు కేటీఆర్ వెల్లడించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల కోట్ల రూపాయలతో 2 లక్షల 75 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడుతున్నామని పేర్కొన్నారు. ఇళ్ల పంపిణీ విషయంలో కూడా పూర్తి పారదర్శకతను పాటిస్తామని తెలిపారు.
అయితే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించామని.. వాటన్నింటినీ దశల వారీగా ఇస్తామని వెల్లడించారు. డిగ్నిటీ హౌసింగ్ కాలనీ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.