close
Choose your channels

12న కర్నూలు, 15న రాజధానిలో పవన్ పర్యటన

Monday, February 10, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

12న కర్నూలు, 15న రాజధానిలో పవన్ పర్యటన

టాలీవుడ్ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటు సినిమాలు.. అటు రాజకీయాలతో బిజిబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ‘పింక్’ రీమేక్ షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది. దీంతో కాస్త గ్యాప్ రావడంతో మళ్లీ కార్యకర్తలు, అభిమానులకు దగ్గరవుతూ పార్టీని బలోపేతం, ప్రజా సమస్యలను పరిష్కారం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా.. ఈ నెల 12న కర్నూలు జిల్లాలో.. 15న రాజధాని అమరావతి గ్రామాల్లో పవన్ పర్యటించబోతున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను పార్టీ అధికారికంగా విడుదల చేసింది.

ఈ నెల 13న పర్యటన ఇలా..!
విద్యార్థిని సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పవన్ ఈ నెల 12 న కర్నూలులో ర్యాలీ చేపట్టి, బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాజ్ విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలో జనసేన నాయకులూ, శ్రేణులు, వివిధ ప్రజా సంఘాలు పాల్గొంటాయి. అనంతరం కోట్ల కూడలిలో బహిరంగ సభ నిర్వహిస్తారు.

రెండ్రోజుల పర్యటన..!
13న ఉదయం నుంచి సాయంత్రం వరకూ కర్నూలు, ఎమ్మిగనూరులో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకొనేందుకు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడతారు. కర్నూలులో ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న జోహరాపురం వంతెన సమస్యపై స్థానికులతో జోహరాపురం ప్రాంతంలో మాట్లాడతారు. అనంతరం జి+ 2 గృహాలను నిర్మించిన ప్రాంతానికి వెళ్తారు. గృహాలు కేటాయింపు పొందిన లబ్ధిదారులతో సమావేశమవుతారు. అనంతరం ఎమ్మిగనూరు వెళ్తారు. అక్కడ వీవర్స్ కాలనీని సందర్శిస్తారు. చేనేత కార్మికుల సమస్యల గురించి అడిగి తెలుసుకుంటారు.

రాజధాని ప్రాంతాల్లో..!
ఈ నెల 15 వ తేదీన రాజధాని అమరావతి గ్రామాల్లో పవన్ పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించిన ప్రణాళికను జనసేన నాయకులు సిద్ధం చేశారు. ఎక్కువమంది ప్రజలను కలిసేలా ఈ పర్యటన ప్రణాళికను రూపొందించాలని పవన్ చేసిన సూచన మేరకు అందుకు అనుగుణంగా స్థానిక జనసేన నాయకత్వం ఏర్పాట్లను చేస్తోంది. జనసేనాని పర్యటన కోసం గత కొద్ది రోజులుగా రాజధాని వాసులు ఎదురు చూస్తున్నారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సందర్భంగా గాయపడిన వారు పవన్‌ను కలిసి మరోసారి అమరావతి గ్రామాల్లో పర్యటించవలసిందిగా విజ్ఞప్తి చేయగా.. వారికిచ్చిన మాట ప్రకారం ఈ పర్యటన ఖరారైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.