close
Choose your channels

నాన్న నేను మోసపోయానంటూ.. సెల్ఫీ వీడియో తీసి యువతి ఆత్మహత్య

Wednesday, March 31, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రేమించిన వాడే సర్వస్వం అనుకుంది.. వాడి తర్వాతే ఎవరైనా అనుకుంది.. కానీ అతడలా భావించలేదు.. సోషల్ మీడియా ప్రేమ.. రోజుల్లోనే డిలీట్ అయిపోయింది. అంతే.. భరించలేక పోయింది. బలవన్మరణాన్ని ఆశ్రయించింది. ఆత్మహత్యకు ముందు ఆమె తన తండ్రి, అన్నను ఉద్దేశించి తీసుకున్న సెల్ఫీ వీడియోలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

‘నాన్నా.. నన్ను క్షమించు. మిమ్మల్ని కాదని వీడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. భవిష్యత్తు గురించి ఎంతో ఊహించుకున్నా. కానీ నేను మోసపోయాను. నన్ను మోసం చేశాడు. ఈ మోసాన్ని భరించలేకపోతున్నా. అందుకే మీ నుంచి దూరంగా శాశ్వతంగా వెళ్లిపోతున్నా’ అంటూ తండ్రికి.. ‘ఓరేయ్, అన్నయ్యా.. నేను ఏ తప్పూ చేయలేదురా. ప్రాణంగా ప్రేమించిన వాడే మోసం చేశాడు. పెళ్లి పేరుతో నాతో ఆటలు ఆడాడు. నేను మోసపోయా. నన్ను క్షమించరా. చనిపోతున్నా’ అంటూ అన్నయ్యకు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి పెట్టి బలవన్మరణానికి పాల్పడింది. అసలు విషయంలోకి వెళితే..

హైదరాబాద్‌లోని మీర్ పేటకు చెందిన ఐశ్వర్య(20) అనే యువతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమెకు ఇన్‌స్టాగ్రాంలో మారెడ్డి ఆశిర్(21) అనే యువకుడితో పరిచయమైంది. ఆశిర్ ఖైరతాబాద్‌లో టెలీకాలర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి కొద్ది రోజుల్లోనే పెళ్లికి దారితీసింది. ఇద్దరూ గతేడాది ఫిబ్రవరి 20న హైదరాబాద్‌లోని సంఘీ టెంపుల్‌లో పెద్దలకు తెలియకుండా రహస్య వివాహం చేసుకున్నారు. అనంతరం గదిని అద్దెకు తీసుకుని కాపురం మొదలు పెట్టారు. అయితే పెళ్లయిన నాటి నుంచే ఉద్యోగం మానేసిన ఆశిర్, ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉండేవాడు. ఆ తరువాత నుంచి ఆమెను నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు. వారి ప్రేమ పెళ్లి గురించి తెలిసిన ఆమె తల్లిదండ్రులు వారి వద్దకు వచ్చి, ముందుగా జీవితాల్లో సెటిల్ అవండంటూ, చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోండంటూ హెచ్చరించి, ఐశ్వర్యను తమతో పాటు తీసుకెళ్లిపోయారు.

అనంతరం ఐశ్వర్య గర్భవతి అని తెలుసుకుని ఆశిర్ ఆమెకు గర్భస్రావం చేయించాడు. అసలే తనను నిర్లక్ష్యం చేస్తున్నాడన్న బాధలో ఉన్న ఐశ్వర్య.. గర్భస్రావం కూడా చేయించడంతో మరింత కుంగిపోయింది. 20 రోజులుగా ఐశ్వర్య బంజారాహిల్స్‌లోని ఓ పేయింగ్ గెస్ట్ హౌస్‌లో ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె గత ఆదివారం మియాపూర్‌లోని ఆశిర్ ఇంటికి వెళ్లి.. తన విషయం తేల్చాలని అతడి తల్లిని నిలదీయగా ఆమె మరో రెండేళ్లు ఆగాలని చెప్పి పంపించేసింది. దీంతో మనస్థాపానికి గురైన ఐశ్వర్య.. పేయింగ్ గెస్ట్ హౌస్‌కు వచ్చి గదిలో ఎవరూ లేని సమయంలో తండ్రి, సోదరుడు, ఆశిర్‌కు వేర్వేరుగా సెల్ఫీ వీడియోలు రికార్డు చేసి ఆత్మహత్య చేసుకుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.