close
Choose your channels

వైవీ సుబ్బారెడ్డి కీలక పదవి ఫిక్స్ చేసిన జగన్!

Sunday, June 2, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైవీ సుబ్బారెడ్డి కీలక పదవి ఫిక్స్ చేసిన జగన్!

వైవీ సుబ్బారెడ్డి.. వైఎస్ ఫ్యామిలీకి చాలా దగ్గరి వ్యక్తి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డికి సడుగుడు.. వైఎస్ జగన్‌కు బాబాయ్ వరుస అవుతారు. రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ, వైవీ సుబ్బారెడ్డి సతీమణి ఇద్దరూ సొంత అక్కా చెల్లెళ్లే. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా.. వైవీ సోదరిని వివాహం చేసుకున్నారు. అలా వీళ్ల మధ్య దగ్గరి బంధుత్వం ఉంది. ఇక పార్టీ విషయానికొస్తే.. వైసీపీలో కీలక నేతగా పేరుగాంచిన వైవీ.. ఇన్నాళ్లు ఎలాంటి పదవులు ఆశించకుండానే.. పార్టీని బలోపేతం చేస్తూ.. పార్టీ కోసమే పనిచేస్తున్నారు. అంతేకాదు ఒకానొక సందర్భంలో ఈయన పార్టీ మారిపోతారని.. అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ పుకార్లేనని సొంత పార్టీని.. ఫ్యామిలీని వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన వ్యక్తి వైవీ.

తిరుగులేని నేతగా..!

వైవీ సొంత జిల్లా ప్రకాశం. ఈయన ఒక్క సొంత జిల్లానే కాకుండా అన్ని జిల్లాలోనూ పార్టీని బలోపేతం చేయడంలో.. పార్టీలో నేతల సమన్వయంగా ఉండటం ఇలా పార్టీ కోసమే పనిచేస్తూ తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఈయన ఎమ్మెల్యే గానీ.. ఎంపీ గానీ టికెట్ ఇవ్వని జగన్.. పార్టీ అధికారంలోకి వస్తే కీలక పదవి ఇవ్వాలని అప్పుడే డిసైడ్ అయిపోయారు. అందుకే వైవీని ఎన్నికలకు దూరంగాపెట్టి.. కొత్తగా పార్టీలోకి వచ్చిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి పార్లమెంట్ టికెట్ ఇప్పించి గెలిపించారు. అయితే ఎన్నికలు అయిపోయాయ్.. వైసీపీ ఘన విజయం సాధించింది.. సీఎంగా జగన్ కూడా ప్రమాణం చేసేశారు. ఇక వైవీ సుబ్బారెడ్డి పరిస్థితి ఏంటి..? అనుకున్నట్లుగానే వైసీపీ అధికారంలోకి వచ్చింది..? ఇక వైవీకి ఏ పదవి ఇస్తారు..? అని అనుచరులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

టీటీడీ చైర్మన్‌గా ఫిక్స్..!

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని బాబాయ్ వైవీకి కట్టబెట్టాలని జగన్ ఫిక్స్ అయిపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా.. ఇప్పటికే టీడీపీ నేతలు దాదాపు అన్ని నామినేటెడ్ పదవులకు రాజీనామా చేసేశారు. అయితే టీటీడీ పాలక మండలి మాత్రం ఇంకా రద్దు చేయలేదు. మరో 2,3 రోజుల్లో రద్దుచేసే అవకాశం ఉందని.. టీటీడీకి కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసి వైవీ సుబ్బారెడ్డిని చైర్మెన్ పదవిలో కూర్చోబెట్టాలని జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. వెంకన్న సన్నిధానంలో పనిచేసేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని వైవీ కూడా తన సన్నిహితుల వద్ద చెప్పుకున్నట్లు సమాచారం. మరోవైపు.. ఇప్పటికే ఆయన బావమరిది బాలినేనికి మంత్రి పదవి ఇస్తానని వైఎస్ జగన్ తేల్చిచెప్పేశారు. వైవీ టీటీడీకి వెళ్లిపోతే.. బాలినేనికి మంత్రి పదవి ఇవ్వొచ్చని జగన్ కూడా అనుకుంటున్నారట.

ముగ్గురు కీలకనేతలు ఎదురుచూపు!

అయితే ఈ టీటీడీ చైర్మన్ పదవికి కడప జిల్లాలో ఇద్దరు కీలకనేతలు.. తిరుపతికి చెందిన ఓ కీలక నేత పోటీపడుతుండటంతో ప్రస్తుతం దీన్ని పెండింగ్‌లో పెట్టారని మొదట కేబినెట్ విస్తరణ జరిపిన తర్వాతే ఈ టీటీడీ పంచాయితీ ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఫైనల్‌గా జగన్ ఈ పదవి ఎవరికి కట్టబెడుతారో..? సీఎం నిర్ణయంతో ఎవరి ఆశలు గల్లంతవుతాయో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.