close
Choose your channels

‘క్రేజీ’గా హ్యాట్రిక్ కొట్టేసిన కేజ్రీవాల్..!

Tuesday, February 11, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఢిల్లీ ఎన్నికల్లో అన్నీ అనుకున్నట్లే జరిగాయ్.. కేజ్రీవాల్ మరోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తారని తెలుసు.. అయితే ఓటింగ్ మొదలుకుని కౌంటింగ్ వరకూ ఎప్పుడేం జరుగుతుందో..? ఎక్కడ ఈవీఎంల వ్యవహారంలో మార్పులు చేర్పులు జరుగుతాయోనని ఒకే ఒక్క భయం తప్పితే కచ్చితంగా కేజ్రీనే.. ఈసారి కూడా ‘క్రేజీ’ గా గెలిచేసి ‘తీన్‌‌మార్’ మూడోసారి సీఎం పీఠమెక్కుతారని తెలుసు. అంతేకాదు.. ఎగ్జిట్స్ పోల్స్ కూడా ‘కేజ్రీ’కే ఢిల్లీ పీఠం అని తేల్చేశాయి. అయితే అనుకున్నట్లుగానే ఎక్కడా ఏం జరగలేదు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ అయిపోయింది. ఏ ఒక్కరి సాయం లేకుండా.. ఢిల్లీని తన గుర్తైన ‘చీపురు’తో క్రేజీగా కేజ్రీవాల్ ఊడ్చేశారు.

ముచ్చటగా మూడోసారి..!
మొత్తం 70 సీట్లకు గాను 62 స్థానాల్లో ఆప్ విజయం సాధించగా.. బీజేపీ 8 నియోజవర్గాల్లో.. ఇక కాంగ్రెస్ అయితే అడ్రస్ లేకుండా పోవడం గమనార్హం. కాగా.. ఈ గెలుపుతో వరుసగా మూడో సారి కేజ్రీవాల్ సీఎం పీఠం దక్కించుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు. అంటే కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టేశారన్న మాట. అయితే ఢిల్లీని ఒకప్పుడు ఏలిన కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురువ్వడం గమనార్హం. అప్పట్లో వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన (షీలా దీక్షిత్ నేతృత్వంలో) కాంగ్రెస్ ఇప్పుడు ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్‌లో గెలవలేని పరిస్థితి నెలకొందంటే పరిస్థితి ఎలా మారిపోయందో అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే అవ్వగా ఇప్పుడు అంతకంటే దారుణంగా మారిపోయింది. అయితే బీజేపీ మాత్రం గత ఎన్నికలతో పోలిస్తే కొంచెం బలపడటమే కాకుండా.. ఓటు బ్యాంకును కాపాడుకుంటూ వచ్చిందని చెప్పుకోవచ్చు.

లవ్ యూ ఢిల్లీ!
ఢిల్లీలో హ్యాట్రిక్ విజయం సాధించిన ఆప్ సంబరాల్లో ముగినిపోయింది. భార్య పుట్టిన రోజు నాడే ‘సామాన్యుడు’ చిరస్మరణీయ గెలుపు అందుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు. ఫలితాల అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కేజ్రీవాల్.. ‘ఐ లవ్ యూ ఢిల్లీ’ అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. సొంత కొడుకులా ఆదరించి మూడోసారి నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ ద్వారా దేశంలో కొత్త తరహా రాజకీయాలు మొదలయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. ‘దేశంలో కొత్త తరహా రాజకీయాలకు ఢిల్లీ జన్మనిచ్చింది. మూడోసారి ఆప్‌పై నమ్మకం ఉంచినందుకు ఢిల్లీ ప్రజలకు నా ధన్యవాదాలు. ఇది దేశ విజయం. ఇది నన్ను కొడుకుగా భావించి ఓటేసిన ప్రజల విజయం. ప్రజలకు మేం కల్పించిన సౌకర్యాలే మా విజయానికి బాటలు వేశాయి. విద్యుత్, నీటి సరఫరా, పౌరసేవలు, విద్యా, వైద్య కోసం చేసిన కృషి వల్లే ప్రజలు ఆదరించారు. మంగళవారం నాడు ఢిల్లీ ప్రజలను హనుమంతుడు ఆశీర్వదించారు. మరో ఐదేళ్ల పాటు ప్రజలకు సేవ చేసేందుకు ఆ హనమంతుడు సన్మార్గాన్ని చూపిస్తాడని నమ్ముతున్నాం’ అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.

అభినందించిన పెద్దలు!
మూడోసారి ముచ్చటగా గెలిచిన కేజ్రీవాల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనకు అభినందనలు తెలిపారు. అంతేకాదు పలు పార్టీల అధినేతలు సైతం ఆయన్ను సోషల్ మీడియా, మీడియా వేదికగా అభినందించారు. అయితే కేజ్రీవాల్ కూడా ప్రతి స్పందించి.. ధన్యవాదాలు తెలిపారు. కాగా ఇదే హ్యాట్రిక్ ఊపుతో హర్యానా, పంజాబ్, గోవా, బీహార్ తదితర రాష్ట్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కేజ్రీవాల్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇదివరకే ఇక్కడ పోటీ చేసిన ఆప్.. ఈసారి సీఎంపై కన్నేసింది. మరి ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే.

ప్రేమికుల రోజున ప్రమాణం!
కాగా.. ఫిబ్రవరి-14న అనగా వాలెంటైన్స్ డే రోజున కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. కాగా ఇప్పటికే రెండు సార్లు కూడా ఆయన వాలెంటైన్స్ డే నాడే ప్రమాణం చేయడం విశేషమని చెప్పుకోవచ్చు. ఇవాళ కేజ్రీవాల్ భార్య పుట్టిన రోజు.. అంటే భార్య పుట్టిన రోజున గెలిచిన కేజ్రీవాల్.. ప్రేమికుల రోజున ప్రమాణం చేసి సీఎం పీఠంలో కూర్చోబోతున్నారన్న మాట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.