'పెద్ద' ఓట్లు చంద్రబాబుకా.. వైఎస్ జగన్కా..!?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతల నోట వచ్చే హామీలు కోటలు దాటుతున్నాయ్.! ఓ వైపు చంద్రబాబు.. మరోవైపు జగన్.. మధ్యలో పవన్ ఇస్తున్న హామీలతో అసలు ఎవరికి ఓటేయాలో తెలియని పరిస్థితులు ‘పెద్ద’లు ఉన్నారు. ఇక అసలు విషయానికొస్తే.. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇప్పటికే ‘నవరత్నాలు’ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న పింఛన్ల వయస్సు 65 నుంచి 60కి తగ్గిస్తామని.. అవ్వ తాతకి నెలకు రూ. 2000 చొప్పులు ఇస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు వికలాంగులకు పింఛన్ రూ.3000 ఇస్తామని ప్రకటించారు. ఈ నవరత్నాలను ఇప్పటికే వైసీపీ శ్రేణులు జనాల్లోకి తీసుకెళ్లి ప్రచారాలు కూడా చేసుకుంటున్నారు. ఇలా నవరత్నాల్లోని ప్రతీ హామీని వైసీపీ అధికారంలోకి వచ్చాక తూ.చ తప్పకుండా నెరవేరుస్తుందని జగన్ స్పష్టం చేశారు.
బాబు నోట అదే మాట..!
ఇటీవల జరిగిన ఓ జన్మభూమి-మన ఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పింఛన్లపై పండుగ ముందు తియ్యటి శుభవార్త చెప్పారు. అంతా ఓకేగానీ ఏదైతే జగన్ రెండు వేలు అని చెప్పారో.. అదే మాట చంద్రబాబు నోట రావడం గమనార్హం. అంతటితో ఆగని చంద్రబాబు ఫిబ్రవరి నెల నుంచి ఆ పెంచిన పింఛన్లు అమలు చేస్తామని కూడా ‘పెద్ద’ల ఓట్ల కోసం చంద్రబాబు ఈ ప్రకటన చేసేశారు. బాబు ప్రకటనపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. "బాబూ.. నీ సబ్బు స్లోనా ఏంటి" అంటూ ఓ ప్రకటనను గుర్తు చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.
ఒకప్పుడు కాదంటివీ కదా బాబూ..!
నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్ నవరత్నాలు ప్రకటించిన సమయంలో చంద్రబాబు మొదలకుని తెలుగు తమ్ముళ్లు మీడియా ముందుకొచ్చి.. ‘ఈ ప్రకటనలకు దేశ బడ్జెట్ సరిపోదు.. ఇవన్నీ జరుగని పనులు’ అంటూ జగన్ను దుయ్యబట్టారు. అయితే అదే చంద్రబాబు నోట.. జగన్ చేసిన ప్రకటనే రావడంతో ఈ ప్రకటన ఎక్కడో విన్నామంటూ జనాలు సైతం అనుకున్నారు. ఒక్క పింఛన్లే కాదు.. ఆశా వర్కర్లకు, అంగన్ వాడీలకు జీతాలు పెంచుతామని పాదయాత్రలో జగన్ మాటిచ్చారు కూడా. అయితే బాబు ప్రకటనతో ఆయన అనుకూలంగా పత్రికలు, మీడియా చానెళ్లు ఓ రేంజ్లో డప్పుకొట్టేశాయి. పండుగ గిఫ్ట్, పెద్దన్నలా, పెద్ద కొడుకులా తమను ఆదుకోవడానికి చంద్రబాబు రూపంలో వచ్చారని అంటూ పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి.
వాట్ నెక్స్ట్..?
మొత్తానికి చూస్తే ప్రకటనలు ఓ రేంజ్లో చెప్పకుంటూ వెళ్తున్నారు. ఒకరి పథకాలు మరొకరు పైవిధంగా చెబుతూ ఎన్నికలకు మూడ్నెళ్ల ముందే ఇలా ప్రజాక్షత్రంలోకి వెళ్తున్నారు. అయితే ఇప్పటికే ఇంటింటికీ స్మార్ట్ ఫోన్, ప్రతీ పేదోడికి ఇళ్లు, సంక్రాంతి తర్వాత రుణమాఫీ ఇలా పలు హామీలిచ్చుకుంటూ జన్మభూమి- మా ఊరు కార్యక్రమంతో జనాల్లోకి మమేకవుతున్నారు. మరోవైపు తన పాదయాత్రలో జరిగిన ప్రతి బహిరంగ సభల్లో నవరత్నాలను నిశితంగా వివరిస్తూ.. మరోవైపు నేతలకు, పార్టీ శ్రేణులు ఎన్నికల క్షేత్రంలో దూసుకెళ్తోంది. అయితే పార్టీల అధినేతలు ఇచ్చిన హామీలు ఆచరణలోకి తెచ్చేదెవరు..? ఎవరు జనాలను ఆదుకునే నేత..? అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.