close
Choose your channels

ఇప్పటికీ సమైక్యవాదినే.. టీఆర్ఎస్‌లో సమైక్యవాదులు లేరా, కేసీఆర్‌నే కొడతానన్నారు: జగ్గారెడ్డి

Saturday, April 30, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్ధితులు, పరిపాలనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. నిన్నంతా టీఆర్ఎస్, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీనిని గమనించిన కేటీఆర్.. వివాదానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో శుక్రవారం అర్ధరాత్రి ట్వీట్ చేశారు. జగన్ తనకు సోదర సమానుడని.. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. అయితే శనివారం ఉదయం తలసాని శ్రీనివాస్ యాదవ్ సీన్‌లోకి రావడంతో మళ్లీ పొలిటికల్ హీట్ పెరిగింది.

ఈ నేపథ్యంలో తలసానిపై మండిపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. టీఆర్ఎస్ పార్టీలో సమైక్యవాదులు కనిపించడం లేదా అంటూ ఫైరయ్యారు. తాను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ సమైక్యవాదినేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఉద్యమంలో కేసీఆర్‌ను ఊరికించి కొడుతానన్న ఎర్రబెల్లి దయాకర రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్.. టీఆర్ఎస్ క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు నిఖార్సైన స్వమైక్యవాదులేనని ఆయన గుర్తుచేశారు.

ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలను ఊరికించి కొట్టిన దానం నాగేందర్ ఇప్పుడు అధికార పార్టీలోనే ఉన్నాడని జగ్గారెడ్డి మండిపడ్డారు. పార్టీలో వున్న సమైక్యవాదుల గురించి టీఆర్ఎస్ ఎలాంటి జవాబు చెబుతుంది.. దీని సమాధానం ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. సినిమా డైలాగ్‌లు మాట్లాడటం కాదని… నువ్వు మాట్లాడిన మాటలను తాము సీరియస్ గానే తీసుకుంటున్నామని తలసానిని హెచ్చరించారు. తాను డైరెక్ట్‌గా సమైక్యవాదినని .. మీరు ఇన్‌డైరెక్టు‌గా సమైక్యవాదులేనని జగ్గారెడ్డి అన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పరిపాలనలో ఆంధ్రా కాంట్రాక్టర్లే పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోసారి మాట్లాడితే మీ మొత్తం చరిత్ర చెప్తానంటూ జగ్గారెడ్డి హెచ్చరించారు. రాహుల్ గాంధీని ఓయూకి రావొద్దు అనడానికి మీరు ఎవరు అని ఆయన ప్రశ్నించారు. ఓయూ మీ అయ్యా జగిరా ? అంటూ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యార్ధుల భవిష్యత్తు దృష్టిలో వుంచుకొని రాహుల్ గాంధీని ఓయూకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే.. చేతగాని మీ టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించే విధంగా ఓయూ వీసీ ద్వారా ఈ నాటకం ఆడిస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ పట్ల మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్‌ని ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకుపోలేని దద్దమ్మలు టీవీలో మాట్లాడుతారా.. అంటూ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ పర్యటన ముగిసిన తర్వాత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తన కార్యాచరణ ప్రకటిస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.