close
Choose your channels

Ramcharan:ఎన్టీఆర్‌ స్వయంగా నాకు టిఫిన్ వడ్డించారు.. ఆ క్షణాలను మరచిపోలేను : రామ్ చరణ్

Monday, May 22, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు సినిమా పవర్ ఏంటో ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ చాటి చెప్పారని అన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో శనివారం టీడీపీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చెర్రీ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్‌ గురించి ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియడం లేదని.. ఏ స్థాయి గురించి మాట్లాడినా, ఆ స్థాయిలన్నింటినీ మించిన వ్యక్తని చరణ్ అన్నారు. రాముడు, కృష్ణుడు గురించి మాట్లాడితే మన మనస్సులో మెదిలే రూపం ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన సాధించిన విజయాలను, చూపిన బాటను గుర్తుచేసుకుంటూ .. ఆ మార్గంలో నడుస్తుంటే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదని చరణ్ పేర్కొన్నారు. తనతో సహా ప్రతిరోజూ సినిమా సెట్‌కి వెళ్లే ప్రతి ఆర్టిస్ట్ ఆయన పేరుని గుర్తు తెచ్చుకోకుండా వుండరని ప్రశంసించారు.

జీవితంలో ఒకే ఒక్కసారి ఎన్టీఆర్‌ను కలిశా :

అస‌లు అస‌లు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ అంటే ఏంటో ప‌క్క రాష్ట్రాల‌కి, దేశానికి, విదేశాలకి చాటి చెప్పిన వ్య‌క్తి ఎన్టీఆర్ అని చరణ్ పేర్కొన్నారు. అలాంటి వ్య‌క్తి న‌డిచిన ఇండ‌స్ట్రీ మనదని, అలాంటి వ్య‌క్తి ప‌ని చేసిన ఇండ‌స్ట్రీలో తామంతా ప‌ని చేస్తున్నామంటే అంత కంటే గర్వం ఇంకేముందని చరణ్ అన్నారు. తాను జీవితంలో ఎన్టీఆర్‌ను ఒకే ఒక్కసారి మాత్రమే కలిశానని.. తాను, పురందేశ్వరి గారి అబ్బాయి రితేష్ కలిసి స్కేటింగ్ క్లాసులకు వెళ్లే వాళ్లమని గుర్తుచేసుకున్నారు. తెల్లవారుజామున ఐదున్నర, ఆరు గంటలకల్లా స్కేటింగ్ క్లాసులు అయిపోయేవని.. ఓ రోజున రితేష్ మా తాత ఎన్టీఆర్ ఇంటికి వెళ్దామా అని అడిగాడని చరణ్ చెప్పారు. అయితే అప్పటికీ ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో భారీ భద్రత వుండేదని.. అక్కడకు వెళ్లగలమా , లేదా అని చెప్పలేక రితేష్‌తో సరేనని తల ఊపానని చెర్రీ అన్నారు.

ఆ వయసులోనూ చికెన్ తింటున్నారు :

అనుకున్నదే తడవుగా స్కేటింగ్ చేసుకుంటూ పురందేశ్వరి గారి ఇంటి నుంచి వెళ్లామని.. ఆ కిందకు వెళితే ఎన్టీఆర్ నివాసం వచ్చిందని చరణ్ చెప్పాడు. అప్పుడు ఉదయం ఆరున్నర గంటలు అవుతుందని .. ఒకసారి ఎన్టీఆర్‌ను చూసి వెళ్లిపోదామని అనుకున్నానని .. కానీ అప్పటికే పెద్దాయన రెడీ అయి టిఫిన్ చేద్దామని కూర్చున్నారని ఆయన తెలిపారు. అందరూ చెప్పినట్లే పెద్ద చికెన్ పెట్టుకుని ఆ వయసులోనూ హాయిగా తింటున్నారని చరణ్ పేర్కొన్నాడు. అయితే తాము వెళ్లేసరికి మమ్మల్ని కూడా పక్కన కూర్చోబెట్టుకుని స్వయంగా టిఫిన్ పెట్టారని గుర్తుచేసుకున్నారు చెర్రీ. అది తాను చేసుకున్న అదృష్టమని, ఆయనతో కలిసి టిఫిన్ చేసిన క్షణాలను జీవితాంతం మరచిపోలేనని.. అలాంటి అవకాశాన్ని కల్పించినందుకు పురంధేశ్వరి గారికి చరణ్ వేదిక మీదే థ్యాంక్స్ చెప్పారు.

జై ఎన్టీఆర్ అంటూ ముగించిన చరణ్ :

తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు బతికే వుంటుందని.. రాబోయే తరాలు ఆయన గురించి తెలుసుకునేలా చేసే ఇలాంటి కార్యక్రమాలు చాలా ముఖ్యమని చరణ్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించిన చంద్రబాబు, ఈ ఈవెంట్‌కు తనను ఆహ్వానించిన బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పారు చరణ్. మా ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి బాలయ్వ వస్తారని.. ఆయనకు మరోసారి థ్యాంక్స్ . ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా గర్వంగా వుందని.. నందమూరి అభిమానులందరినీ కలిసినందుకు ఆనందంగా వుందన్న చరణ్.. ‘‘జై ఎన్టీఆర్’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.