close
Choose your channels

నల్గొండలో కుప్పకూలిన హెలికాఫ్టర్... ఇద్దరు మృతి, హృదయ విదారకంగా దృశ్యాలు

Saturday, February 26, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తమిళనాడులోని వెల్లింగ్టన్‌ వద్ద సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూలిన ఘటన దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. దీని నుంచి దేశ ప్రజలు ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో శనివారం అదే తరహాలో తెలంగాణలో చాపర్ కుప్పకూలింది. ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన వారికి బిపిన్ రావత్ హెలికాఫ్టర్ ఘటనే గుర్తుకొచ్చింది. ఈ ప్రమాదంలో శిక్షణ ఇస్తున్న పైలట్‌తో పాటు శిక్షణ తీసుకుంటున్న మరో ట్రైనీ పైలట్ మరణించినట్లుగా తెలుస్తోంది. వీరు ఎవరు.. ఎక్కడి వారు అనేది తెలియాల్సి వుంది. ప్రమాదం గురించి గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించడంతో పోలీస్, రెవెన్యూ, వైద్య, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.

ప్రమాద స్థలంలో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. హెలికాఫ్టర్ విడిభాగాలు చెల్లచెదురుగా పడివున్నాయి. చనిపోయిన పైలట్, ట్రైనీ పైలెట్‌ మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయి. ఈ పరిస్థితిని చూసి పలువురు కంటతడిపెట్టారు. హెలికాఫ్టర్ గాల్లోకి లేచిన తర్వాత ఇంజిన్‌లో సమస్య వచ్చి మంటలు అంటుకుని ఉంటాయని భావిస్తున్నారు. హెలికాఫ్టర్ కూలిపోయే సమయంలో మంటలు అంటుకుని తగలబడుతూ కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఆ శిక్షణ హెలికాఫ్టర్ ఏ సంస్థది.. ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారన్నది తేలాల్సి ఉంది. దర్యాప్తు తర్వాతే పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

కాగా.. గతేడాది డిసెంబర్ 8న సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు సహా 14 మందితో ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాఫ్టర్ తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశాన్ని విషాదంలోకి నెట్టింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.