close
Choose your channels

బిజినెస్‌లో సంపాదించిన డబ్బును ప్రజాసేవకు వెచ్చించారు .. గౌతంరెడ్డికి పవన్ నివాళి

Monday, February 21, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గుండెపోటుతో మరణించిన  ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి భౌతికాయానికి జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. అనంతరం గౌతంరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ.. పరిశ్రమల శాఖ మంత్రిగా మేకపాటి రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారని ప్రశంసించారు. అలాంటి వ్యక్తి హఠాన్మరణం.. రాష్ట్రానికి తీరనిలోటని, వ్యాపారంలో సంపాదించిన డబ్బును ప్రజాసేవకు ఖర్చు చేశారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆయన మృతికి సంతాపంగా తన సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నామని పవన్  కల్యాణ్ వెల్లడించారు.

మరోవైపు తండ్రి మరణవార్తను తెలుసుకున్న అమెరికాలో వున్న మేకపాటి గౌతంరెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి భారత్‌కు బయల్దేరారు. రేపు ఉదయం ఆయన స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. బుధవారం నెల్లూరు జిల్లా బ్రహ్మణపల్లిలో ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతకుముందు అపోలో ఆస్పత్రి నుంచి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తీసుకెళ్లారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఈ సాయంత్రం వరకు అక్కడే ఉంచనున్నారు. రేపు నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామానికి గౌతమ్‌రెడ్డి పార్ధీవదేహాన్ని తరలించనున్నారు. ఆయన మరణం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.

కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా మంచిపేరు తెచ్చుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర ప్రజలు, నేతలు గౌతమ్ రెడ్డికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.