close
Choose your channels

KCR:ఉద్యమ కాలం నాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారు.. రాబోయే రోజులు మనవే: కేసీఆర్

Thursday, April 18, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భవిష్యత్తులో ఉద్య‌మ కాలం నాటి కేసీఆర్‌ను మ‌ళ్లీ చూస్తార‌ని బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన పార్టీ విస్తృతస్థాయి స‌మావేశంలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. 17 ఎంపీ నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థుల‌కు బీ ఫారాలు అంద‌జేశారు. అలాగే ఎన్నిక‌ల ఖ‌ర్చు నిమిత్తం ఒక్కో అభ్య‌ర్థికి రూ. 95 ల‌క్ష‌ల విలువ చేసే చెక్కుల‌ను కూడా అందించారు. లోక్‌స‌భ ఎన్నికల్లో ప్రచారం, అనుసరించే వ్యూహంపై గులాబీ శ్రేణుల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్య‌ర్థుల‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో రాజ‌కీయం గంద‌ర‌గోళం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు. ఏ రాజ‌కీయ గంద‌ర‌గోళం జ‌రిగినా బీఆర్ఎస్‌కే మేలు జ‌రుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం‌పై ప్రజల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ప్రారంభ‌మైందన్నారు. రానున్న రోజులు మ‌న‌వే అని పార్ల‌మెంట్‌లో మ‌న గ‌ళం వినిపించాల్సిన అవ‌స‌రం ఉందని చెప్పుకొచ్చారు. రైతు స‌మ‌స్య‌లు అజెండాగా ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్లాలని సూచించారు. కొంద‌రు నేత‌లు పార్టీని వీడి వెళ్లినంత మాత్రానా బీఆర్ఎస్‌కు న‌ష్టం ఏమీ లేదు అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

మరోవైపు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ సరికొత్త పంథా ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది. ఎండిన పంట పొలాల‌ను ప‌రిశీలించ‌డంతో పాటు రోడ్డు షోల్లో పాల్గొనాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు సమాచారం. ఉదయం 11 గంట‌ల‌ వరకు పొలం బాట.. సాయంత్రం నుండి ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో 2-3 చోట్ల రోడ్డు షోలు, కార్న‌ర్ మీటింగ్స్ నిర్వ‌హించ‌నున్నారట. సిద్దిపేట‌, వ‌రంగ‌ల్‌లో ల‌క్ష మందితో భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హణకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో కనీసం 10 ఎంపీ స్థానాలైనా గెలవాలనే లక్ష్యంగా పెట్టుకుని ప్రచారం చేయనున్నారు.

ఇదిలా ఉంటే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని వెంటనే తాను చేసిన కామెంట్లకు వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘా జారీ చేసిన నోటీసులపై కేసీఆర్ స్పందించారు. నోటీసులపై వివరణ ఇచ్చేందుకు మరో వారం రోజులు గడువు కావాలంటూ విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవలే నిర్వహించిన సిరిసిల్ల సభలో సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డిపై కేసీఆర్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసీఆర్‌కు ఈసీ నోటీసులు ఇచ్చింది. మరి కేసీఆర్ స్పందనపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.