close
Choose your channels

YCP:సర్వే ఏదైనా సరే.. వైసీపీ గెలుపు ఖాయం.. ఉత్సాహంలో క్యాడర్..

Thursday, April 18, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో పోలింగ్‌ సమయం దగ్గర పడ్డే కొద్దీ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. గెలుపు తమదంటే తమదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ మీడియా, సర్వే సంస్థలు తమ ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఇందులో చాలా సంస్థలు వైసీపీ విజయం ఖాయమని చెబుతున్నాయి. ఏ సర్వే చూసినా వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం పక్కా అని తేల్చేస్తున్నాయి. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది.

తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ(NDTV)ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అధికారం చేపట్టనుంది. మొత్తం 25 ఎంపీ సీట్లలో వైసీపీ 16 స్థానాలు దక్కించుకోనుంది. అలాగే టీడీపీ కూటమి 9 స్థానాల్లో విజయం సాధించవచ్చని పేర్కొంది. కూటమిలోని నేతల గొడవలతో పోలింగ్ టైమ్‌కి వైయస్ఆర్‌సీపీకి మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇదే ప్రభావం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉంటుందని ఎన్డీటీవీ తెలిపింది. దీంతో రాష్ట్రంలో వైసీపీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని అర్థమవుతోంది.

ఇక రేస్ పోల్ సర్వే(RACE POLL SURVEY) ప్రకారం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 132-138 స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగరేస్తుందని తేలింది. ఇక టీడీపీ-బీజేపీ-జనసేన కూటమికి కేవలం 37-42 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఏప్రిల్ 16వరకు ఈ వివరాలు సేకరించాలని వెల్లడించింది. ఈ సర్వేలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరు బాగుందని 54శాతం తెలపగా.. 16శాతం బాగోలేదు అని.. 26శాతం మంది పర్వాలేదని.. 4శాతం చెప్పలేమని తెలిపారు. ఇక సీఎంగా ఎవరైతే బాగుంటుందనే దానిపై జగన్ మోహన్ రెడ్డికి 61శాతం మంది మద్దతు చెప్పగా.. 31శాతం మంది చంద్రబాబుకు ఓటు వేశారు. 8శాతం ఇతరులకు సపోర్ట్ చేశారు.

అలాగే మరో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్‌నౌ-ఈటీజీ రీసెర్చ్(TIMES NOW - ETG Research Survey)సర్వేలోనూ లోక్‌సభ ఎన్నికల్లో సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీనే అత్యధిక స్థానాలను దక్కించుకుంటుందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 19-20 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఇక టీడీపీకి 3-4 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అలాగే బీజేపీ ఒక స్థానం రావొచ్చని అంచనా వేసింది. అయితే జనసేనకు మాత్రం ఒక్క సీటు కూడా దక్కదని పేర్కొంది. ఈ లెక్కన చూసుకుంటే టీడీపీ కూటమికి 5 స్థానాలకు మించి రావని.. ఏపీలో వైసీపీ హవా మరోసారి కొనసాగనుందని స్పష్టంచేసింది.

మొత్తానికి ఇలా ఏ సర్వే చూసినా వైసీపీ గెలుపు ఖాయమని తెలుస్తోంది. దీంతో ఫలితాలు వెల్లడి కాగానే ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం ఎక్కడ జరపాలి అనే చర్చల్లో పార్టీ శ్రేణులు బిజీ అయిపోయారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.