close
Choose your channels

Lokesh:లోకేష్ బస్సు యాత్ర.. భువనేశ్వరి పరామర్శ యాత్రకు రంగం సిద్ధం..

Thursday, October 19, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ఆగిపోయిన పార్టీ కార్యక్రమాలను మళ్లీ యాక్టివ్ చేసేందుకు నేతలు రెడీ అయ్యారు. ఈ మేరకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 'నిజం గెలవాలి' పేరుతో ఆమె ఈ పర్యటన చేపట్టనున్నారు. చంద్రబాబు అరెస్టుతో మరణించిన కుటుంబసభ్యులను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. రెండు మూడు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ యాత్ర వారంలో కనీసం రెండు మూడు చోట్ల ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. బాబు అరెస్ట్ అయిన దగ్గరి నుంచి భువనేశ్వరి, బ్రాహ్మణి జనాల్లోకి వెళ్లనున్నారనే వార్తలు వచ్చాయి.

ప్రభుత్వ వేధింపులను జనంలోకి తీసుకెళ్లేలా ప్లాన్..

అయితే కోర్టుల్లో కేసుల నడుస్తుండడం తీర్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని వాయిదా వేస్తూ వచ్చారు. అయితే న్యాయస్థానాల్లో తీర్పు లేటు అవ్వడం, ప్రభుత్వం కేసులు మీద కేసులు పెట్టడంతో తీర్పులు రావడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఈ లోపు జనాల్లోకి వెళ్లి ప్రభుత్వ వేధింపులను బలంగా తీసుకెళ్లాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుకు ముందు ఓ వైపు లోకేష్ యువగళం పాదయాత్ర, మరోవైపు భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో చంద్రబాబు పర్యటనతో టీడీపీ ప్రజల్లో ఉండేది.

భవిష్యత్‌కి గ్యారెంటీ పేరుతో లోకేష్ బస్సు యాత్ర..

కానీ బాబు అరెస్టు తర్వాత ఒక్కసారిగా పార్టీ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. అయితే చంద్రబాబుకు మద్దతుగా నియోజకవర్గాల్లో నేతలు దీక్షలు, ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీ కార్యకలాపాలు ఆగిపోతే ప్రమాదమని గ్రహించిన నేతలు మళ్లీ యాక్టివ్ చేసేలా ప్లాన్ వేస్తున్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభిస్తారని చెప్పిన నేతలు.. కేసుల్లో న్యాయపోరాటం కోసం వాయిదా వేసుకున్నారు. అటు ఢిల్లీ వెళ్లి న్యాయవాదులతో భేటీ కావడం, ఇటు చంద్రబాబుతో జైలులో ములాఖత్ అయి పార్టీ కార్యక్రమాలు గురించి వివరించాల్సి రావడంతో పాదయాత్రను పక్కనబెట్టారు. ఇప్పుడు దాని స్థానంలో చంద్రబాబు చేపట్టిన భవిష్యత్‌కి గ్యారెంటీ పేరుతో బస్సు యాత్రను లోకేష్ కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు..

శనివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. చంద్రబాబు అరెస్టు తర్వాత తొలిసారి జరగనున్న సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. లోకేష్, భువనేశ్వరి యాత్రలకు సంబంధించిన షెడ్యూల్ రూట్‌మ్యాప్‌లు ఖరారు చేయనున్నారు. మొత్తానికి పార్టీ అధినేత అరెస్టుతో స్తబ్దుగా ఉన్న పార్టీ కార్యక్రమాలను మళ్లీ స్టార్ చేసి క్యాడర్‌లో ఉత్సాహం నింపేలా సీనియర్ నేతలు ప్లాన్-బి అమలుకు సిద్ధమయ్యారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.