close
Choose your channels

Buddha Venkanna:లోకేష్‌కు టీడీపీ బాధ్యతలు అప్పగించాలి.. బుద్ధా వెంకన్న హాట్ కామెంట్స్..

Friday, May 24, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా నారా లోకేష్‌కు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. జూన్ 9వ తేదీన అమరావతిలో చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని.. అదే రోజు లోకేష్‌ కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని కోరారు. ఇది తమ రిక్వెస్ట్ కాదు.. డిమాండ్ అని తెలిపారు. యువగళం పేరుతో మూడు వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసి పార్టీ పటిష్టానికి శ్రమించిన లోకేష్ కంటే అర్హుడు ఎవరని ప్రశ్నించారు. పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర అన్ని వర్గాల మద్దతు లోకేష్‌కు ఉందన్నారు.

అక్రమ కేసులో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పార్టీని లోకేష్ సమర్థంగా నడిపారని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీతో కూటమి అధికారం చేపడుతుందని.. ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అందులో సందేహం లేదన్నారు. కూటమి అధికారంలోకి వస్తే కచ్చితంగా లోకేష్‌కు మంత్రి పదవి వస్తుందని అంతకంటే ముందు ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇన్ని రోజులు పార్టీకి సేవలు అందించిన ప్రస్తుత అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని కేబినెట్‌లోకి తీసుకోవాలని సూచించారు. ఈ మార్పు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేపట్టాలని బుద్ధా పేర్కొన్నారు.

చంద్రబాబు ఒక్కరే ఇప్పటి వరకు ఒంటి చేత్తో పార్టీని లాక్కొస్తున్నారని ఇప్పుడు లోకేష్, బ్రహ్మణి, భువనేశ్వరి కూడా తోడయ్యారన్నారు. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుంది అంటే అందులో వీరి అందరి పాత్ర ఉందని అభిప్రాయపడ్డారు. 130 స్థానాలకుపైగా కూటమి గెలుస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అలాగే చంద్రబాబు ఆత్మకథ రాసుకుంటే అందులో తనకూ ఓ పేజీ కచ్చితంగా ఉంటుందన్నారు. 2019లో అధికారం కోల్పోయినా కానీ పార్టీ కోసం చాలా కష్టపడ్డానన్నారు. రాజకీయ నాయకుడి పాదాలకు రక్తంతో అభిషేకం చేసిన చరిత్ర ఎవరికీ లేదని.. తాను మాత్రం ఆ పని చేశాను అన్నారు. అందుకే లోకేష్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. లోకేష్‌కు పదవీ బాధ్యతలు అప్పగిస్తే మరో 30 ఏళ్లు పార్టీ భవిష్యత్‌కు డోకా ఉండదని బుద్ధా వెల్లడించారు.

కాగా జూన్ 4న ఫలితాలు వెల్లడైన తర్వాత కూటమి అధికారంలోకి వస్తే టీడీపీలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కీలక నేతలను మంత్రివర్గంలోకి తీసుకుని.. మిగిలిన సీనియర్ నేతలకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఈ క్రమంలోనే లోకేష్‌కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని బుద్ధా వెంకన్న వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.