close
Choose your channels

‘నిమ్మగడ్డ’దే న్యాయం.. జగన్ సర్కార్‌కు హైకోర్ట్ షాక్

Friday, May 29, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘నిమ్మగడ్డ’దే న్యాయం.. జగన్ సర్కార్‌కు హైకోర్ట్ షాక్

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్‌కు హైకోర్టు మరో షాకిచ్చింది. సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకూ హైకోర్టులో చాలా ఎదురుదెబ్బలే తగిలాయి. తాజాగా కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వాయిదా వేసిన నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు మొట్టికాయలేసింది. ఎస్ఈసీ (స్టేట్ ఎన్నికల కమిషనర్)నిబంధనలు మారుస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తీసుకొచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. అంతేకాదు.. వెంటనే నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి చూస్తే నిమ్మగడ్డ వైపే న్యాయం ఉందన్న మాట.

కనగరాజ్ ఔట్.. విధుల్లోకి నిమ్మగడ్డ!

ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సంచలన తీర్పుగా భావించొచ్చు. ఈసీ తొలగింపులో మొత్తం 13 పిటిషన్లను హైకోర్టు విచారించింది. అనంతరం 213 ప్రకారం ఆర్డినెన్స్ తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని ధర్మాసనం తేల్చింది. ఈ సందర్భంగా ఏపీ సర్కార్ తెచ్చిన జీవోలన్నింటినీ హైకోర్టు కొట్టిపారేసింది. అంతేకాదు వెంటనే నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. కొత్త ఎన్నికల కమిషనర్‌గా నియమించిన మాజీ జడ్జి కనగరాజ్ నియామకం చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. ఈసీగా నిమ్మగడ్డను కొనసాగించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. మరి ఈ వ్యవహారంపై జగన్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.

‘నిమ్మగడ్డ’దే న్యాయం.. జగన్ సర్కార్‌కు హైకోర్ట్ షాక్

నిమ్మగడ్డ స్పందన

హైకోర్టు తీర్పు నిమ్మగడ్డ స్పందించారు. హైకోర్టు తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. న్యాయస్థానం సూచనలతో విధుల్లో చేరుతానన్నారు. నా విధులను నిష్పక్షపాతం నిర్వహించాను. ఇకపైనా నిర్వహిస్తాను. అందరి సంప్రదింపులతోనే స్థానిక ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తాం. వ్యక్తులు శాశ్వతం కాదు.. రాజ్యాంగ వ్యవస్థలే శాశ్వతం. రాజ్యాంగ పరిరక్షణ చేస్తామని ప్రమాణం చేసిన వారు ఆ బాధ్యతల్ని నెరవేర్చాలి’ అని నిమ్మగడ్డ తెలిపారు. మరోవైపు.. ఈ తీర్పును టీడీపీ నేతలు సైతం స్వాగతించారు. ప్రభుత్వం దీనిపై అప్పీల్‌కు వెళ్లదని భావిస్తున్నట్లు సీనియర్ నేతలు చెబుతున్నారు.

ఇదీ అసలు కథ..!

కాగా లోకల్ బాడీ ఎన్నికలను కరోనా కాలంలో ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నామని.. ఎన్నికలు ఎప్పడనేది తదుపరి ప్రకటన చేస్తామని ఎస్ఈసీ ప్రకటించడంతో పెద్ద హడావుడే జరిగింది. ఈ వాయిదా వ్యవహారంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏపీ సీఎం నువ్వా నేనా..? అసలు ఇలాంటి ప్రకటన చేసే అధికారం..?, కలెక్టర్లు, ఎస్పీ, ఎస్సైలు, పోలీసు అధికారులను ట్రాన్స్‌ఫర్ అధికారం మీకెక్కడిది..? అంటూ మీడియా సమావేశం పెట్టి మరీ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను కలిసి జగన్ ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాయిదా రగడ నెలకొంది. ఆ తర్వాత ఇది కాస్త టీడీపీ వర్సెస్ వైసీపీగా పరిస్థితులు మారడం.. హైకోర్టు మెట్లెక్కడం, సీఐడీ ఎంక్వయిరీ వేయడం.. ఈ పంచాయితీ కేంద్రం దాకా కూడా వెళ్లింది. గత రెండు నెలలుగా నెలకొన్న ఈ వివాదానికి మే-29తో ఫుల్ స్టాప్ పడింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.