close
Choose your channels

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ పోటీ చేసే స్థానం ఇదే.. వెల్లడించిన సేనాని..

Thursday, March 14, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవన్ కల్యాణ్‌ పోటీ చేసే స్థానం ఇదే.. వెల్లడించిన సేనాని..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ వీడింది. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు పవన్‌ స్వయంగా వెల్లడించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఈమేరకు ప్రకటన చేశారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కొంతకాలం పవన్ పోటీ చేసే స్థానంపై సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఒకసారి భీమవరంలో చేస్తారని.. మరోసారి పిఠాపురం, తిరుపతిలో పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. చివరకు పిఠాపురం స్థానానికే మొగ్గు చూపారు.

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశలో పవన్ మాట్లాడుతూ సీఎం జగన్‌పై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని తెలిపారు. తాను రాజకీయాల్లోకి అధికారం కోసం రాలేదని.. మార్పు కోసం వచ్చానన్నారు. మమ్మల్ని తొక్కాలని వైసీపీ చూస్తోందని.. కానీ తామే వైసీపికి తొక్కేసి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇక తనకు అన్ని మతాలు గౌరవమేనని చెప్పుకొచ్చారు. ముస్లింలను మైనార్టీలు అంటే తనకు ఇష్టం ఉండదన్నారు. తన భార్య క్రిస్టియన్ అని.. కానీ తాను ఎప్పుడూ క్రిస్టియన్లను ఓట్లు అడగలేదని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా కూటమి గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు.

పవన్ కల్యాణ్‌ పోటీ చేసే స్థానం ఇదే.. వెల్లడించిన సేనాని..

పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన ఇప్పటివరకు 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించడంతో మొత్తం 16 మంది అభ్యర్థుల పేర్లు ఖారారయ్యాయి. ఇక మిగిలిన ఐదు స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం, విజయనగరం జిల్లాలోని పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు, ఏలూరు జిల్లాలోని పోలవరం స్థానాలు ఉన్నాయి.

పవన్ కల్యాణ్‌ పోటీ చేసే స్థానం ఇదే.. వెల్లడించిన సేనాని..

కాగా ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేశ్‌ బాబు, ఎలమంచిలి నుంచి సుందరపు విజయకుమార్‌, విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణయాదవ్‌, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్‌, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్‌, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి దేవవరప్రసాద్‌, తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులుకు అవకాశం ఇచ్చారు. నిడదవోలు నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్‌, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ పేర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.