close
Choose your channels

చిత్ర పరిశ్రమలో మరో విషాదం... ప్రముఖ సింగర్ కన్నుమూత

Monday, December 27, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది పలువురు ప్రముఖులు కన్నుమూశారు. మరో నాలుగు రోజుల్లో 2021 ముగియబోతోంది. వెళుతూ వెళుతూ కూడా మరికొందరిని తన వెంట తీసుకెళ్తోంది. తాజాగా చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నేపథ్య గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం (73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు.

1943 డిసెంబరు 10న జన్మించిన మాణిక్య వినాయగం.. తన బంధువు, గాయకుడు సీఎస్‌ జయరామన్‌ దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్నారు. తమిళ దిల్‌ సినిమాలోని 'కన్నుక్కుల గెలతి' అనే పాటతో ప్లేబ్యాక్‌ సింగర్‌గా కెరీర్‌ ఆరంభించారు. అన్ని భాషల్లో కలిపి 800లకిపైగా పాటల్ని పాడారు. వేల సంఖ్యలో ఆధ్యాత్మిక, జానపదాల్ని ఆలపించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ చిత్రంలోని ‘పట్టుపట్టు చేయ్యే పట్టు’తో తెలుగు ప్రేక్షకుల్ని కూడా విశేషంగా అలరించారు. పాటలు పాడుతూనే నటుడిగానూ తనదైన ముద్రవేశారు. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. 'తిరుద తిరుది' అనే సినిమాలో ధనుష్‌ తండ్రిగా నటించారు. వినాయగం మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.