close
Choose your channels

PM Narendra Modi: నాటు నాటుకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్.. ఆర్ఆర్ఆర్ యూనిట్‌కు ప్రధాని మోడీ అభినందనలు

Wednesday, January 11, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కడంతో టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ సినిమా సంబరాల్లో మునిగిపోయింది. ఇప్పటికే వివిధ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం విషెస్ తెలియజేశారు. గోల్డెన్ గ్లోబ్ అందుకున్న దర్శకుడు ఎంఎం కీరవాణి.. కొరియో గ్రాఫర్ ప్రేమ్ రక్షిత్.. గేయ రచయిత చంద్రబోస్.. ఆలపించిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్..దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.. హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ సహా మొత్తం ఆర్ఆర్ఆర్ యూనిట్‌ను అభినందిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు.అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ తదితరులు కూడా ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనలు తెలియజేశారు.

ప్రధాని మోడీ పర్యటన తాత్కాలిక వాయిదా :

ఇకపోతే.. ఈ నెల 19న ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన తాత్కాలికంగా వాయిదాపడింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సహా మొత్తం రూ.7000 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లను ప్రధాని ప్రారంభించాల్సి వుంది. అయితే అనుకోని కారణాల వల్ల మోడీ పర్యటన వాయిదాపడినట్లు పీఎంవో తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి కొత్త షెడ్యూల్‌ను త్వరలో తెలియజేస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు.

1200 వందల కోట్ల వసూళ్లు సాధించిన ఆర్ఆర్ఆర్:

ఇదిలావుండగా.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ లో విశేషాలు బోలెడు. తెలుగు సినిమాను శాసించే రెండు పెద్ద కుటుంబాలకు చెందిన వారసులు కలిసి నటిస్తే చూడాలని కలలు కన్న వారికి దానిని నిజం చేసి చూపారు జక్కన్న. ఎన్టీఆర్ - రామ్‌చరణ్‌ హీరోలుగా నటించగా బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవ్‌గణ్, అలియా భట్‌లు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో దీనికి మరింత హైప్ వచ్చింది. శ్రీయా శరణ్, సముద్రఖని తదితరులు కీలకపాత్ర పోషించారు. మార్చి 24న రిలీజైన ఈ సినిమా సౌత్ , నార్త్ , ఓవర్సీస్ రికార్డులను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 కోట్ల కలెక్షన్స్ సంపాదించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.