close
Choose your channels

BRS MLC:ట్యాపింగ్ కేసు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కోసం పోలీస్ వాహనాల్లో డబ్బు తరలింపు..

Saturday, April 13, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్యాపింగ్‌తో సంబంధం ఉన్న పోలీస్ అధికారులను ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరి విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ట్యాపింగ్ మాత్రమే కాకుండా వసూళ్ల దందా కూడా చేసినట్లు గుర్తించారు. అలాగే ఎన్నికల సమయంలో ఏకంగా పోలీస్ వాహనాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలకు డబ్బులను తరలించినట్లు అంగీకరించినట్లు సమాచారం. తాజాగా ఈ కేసులో ఏ4 నిందితుడిగా అరెస్టైన టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో మరికొన్ని విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.

2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా.. ఇతర పార్టీల నేతలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడానికి ఫోన్‌ ట్యాపింగ్‌ను రాధాకిషన్‌రావు ఆయుధంగా వినియోగించినట్లు తేలింది. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తన చిన్ననాటి మిత్రుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చెందిన సొమ్మును ఎక్కువగా తరలించినట్లు సమాచారంక. ఇందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్‌ ఎస్సైని ఉపయోగించి డబ్బులను రవాణా చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ డబ్బులకు ఎస్కార్ట్ ఇచ్చి రాధాకిషన్ రావు డెలివరీ చేయించారు. ఎవరికీ అనుమానం రాకుండా పోలీస్ వాహనాల్లోనే ఆ డబ్బును తరలించారు.

పోలీసు శాఖకే చెందిన ఓ బొలెరో వాహనంలో ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకుని సదరు నేతలకు అందజేశారు. ఈ డబ్బు రవాణాలో రిటైర్డ్ ఎస్పీ దివ్య చరణ్ రావు సైతం కీలక పాత్ర పోషించినట్లు విచారణలో వెల్లడైంది. సోమాజిగూడ, మలక్‌పేటలోని ఒక ప్రైవేటు ఆసుపత్రి నుంచి డబ్బులను ఆయన తరలించినట్లు తెలిసింది. అనంతరం ఆ డబ్బులను ఎస్సై బీఆర్ఎస్ నేతలకు ఇచ్చినట్లు సమాచారం. ప్రభాకర్ రావు ఆదేశాలతో రాజకీయ నాయకులపై నిఘా కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రణీతరావు ఇచ్చే సమాచారంతో నిఘా పెట్టారని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించారు. దీంతో రాధా కిషన్‌ రావుకి సహకరించిన ఎస్సైతో పాటు మాజీ ఎస్పీని విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ రిమాండ్ రిపోర్టుల ఆధారంగా త్వరలోనే కొందరు రాజకీయ ప్రముఖులకు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని.. ఇందులో మాజీ మంత్రులు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.