close
Choose your channels

Chiranjeevi : 50 సార్లకు పైగా రక్తదానం చేసిన వారికి ‘చిరు’ భద్రతా కార్డ్ .. గవర్నర్, మెగాస్టార్‌ల స‌త్కారం..

Monday, September 5, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్ధాల పాటు టాలీవుడ్‌ను మకుటం లేని మహారాజుగా ఏలారు. ఒకానొక దశలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ను మించిన స్థార్‌గా, ఆయన కంటే ఎక్కువ పారితోషికం తీసుకునే నటుడిగా చిరంజీవి సంచలనం సృష్టించారు. అయితే ఎంత ఎదిగినా ఒదిగివుండే తత్వం, మంచితనం, మానవత్వం మెగాస్టార్ సొంతం. అందుకే ఆయనను స్పూర్తిగా తీసుకుని ఎంతోమంది హీరోలు, టెక్నీషియన్లు వెండితెరపైకి వచ్చారు.. వస్తున్నారు.

ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్‌లతో లక్షలాది మందికి చిరు సేవ :

ఇకపోతే.. తనను ఈస్థాయికి తీసుకొచ్చిన సమాజానికి, భారతదేశానికి ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ పేరిట ఆయన బ్లడ్ బ్యాంక్‌, ఐ బ్యాంక్ నిర్వహిస్తూ లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టారు. ఇక కరోనా సమయంలో కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి.. ఆక్సిజన్ ప్లాంట్‌లు, రెమిడిసెవర్ వంటి మందులను అందించి ఎంతోమందికి ప్రాణదానం చేశారు.

రక్తదానం చేసిన వారికి ‘‘చిరు భద్రత’’ పేరుతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులు:

చిరంజీవి పిలుపుతో నాటి నుంచి నేటి వరకు కోట్లాది మంది అభిమానులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారిని సత్కరించుకోవాలని మెగాస్టార్ భావించారు. దీనిలో భాగంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా 50 సార్లకి పైగా రక్తదానం చేసిన వారికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా ‘‘చిరు భద్రత’’ పేరుతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు. ఆదివారం రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... 1998లో సమయానికి రక్తం దొరక్క చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలు తనను తీవ్రంగా కలచివేశాయని, తాను పిలుపునిస్తే ఏమైనా చేసే అభిమానులు వున్నారని... వారి ద్వారా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ‘చిరంజీవి బ్లడ్ బ్యాంక్’ను స్థాపించినట్లు మెగాస్టార్ తెలిపారు.

గవర్నర్ ప్రోత్సాహాన్ని మరిచిపోలేను :

ఇప్పటి వరకు 9.30 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించామని, ఇందులో 70 శాతం పేదలకు, మిగిలిన దానిని ప్రైవేట్ ఆసుపత్రులకు అందజేశామని చిరు చెప్పారు. రక్తదానం చేసేవారికి ఈ సందర్భంగా చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే తన తండ్రి పేరిట ఆసుపత్రి నిర్మిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. కరోనా సమయంలో కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ప్రారంభించినప్పుడు.. సినీ కార్మికులకు సరుకులు పంపిణీ చేసినప్పుడు గవర్నర్ తమిళిసై తనను ఎన్నోసార్లు ప్రోత్సహించారని చిరంజీవి గుర్తుచేశారు. తరచుగా రక్తదానం చేసే 2000 మందికి రూ. 7 లక్షల విలువ చేసే ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. వీరందరి ఇన్సూరెన్స్ ప్రీమియం చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ చెల్లింస్తుందని మెగాస్టార్ చెప్పారు.

చిరంజీవి రియల్ హీరో : తమిళిసై

గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. చిరంజీవి సినిమాల్లోనే కాక, బయట కూడా రియల్ హీరో అనిపించుకున్నారని ప్రశంసించారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి ప్రాణదానం చేశారని, దానితో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గవర్నర్ కొనియాడారు. మెగాస్టార్ బాటలోనే ఆయన అభిమానులు కూడా నడుస్తున్నారని వ్యాఖ్యానించారు. నేను హౌజ్ సర్జన్‌గా ఉన్నప్పుడు, తమ కుటుంబంలోనే ఒకరికి రక్తం అత్యవసరమైందని తమిళిసై గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో పేషెంట్‌ని చూసేందుకు చాలామంది వచ్చారు కానీ అతనికి రక్తం కావాలని, ఎవరైనా దానం చేస్తారా అని అడిగితే అందరూ దూరంగా వెళ్లిపోయాని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. రక్తదానం అంత సులువు కాదని.. రక్తం దొరక్క చనిపోయిన పేషెంట్స్‌ని, రక్తం దొరకడం వల్ల ప్రాణాలతో బయటపడిన వాళ్లనూ చూశానని తమిళిసై సౌందరరాజన్ తాను డాక్టర్‌గా వున్న రోజులను గుర్తుచేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.