close
Choose your channels

Chiranjeevi: తమ్ముడు కోసం రంగంలోకి అన్నయ్య.. తన మద్దతు ఎవరికో చెప్పేశారుగా..!

Monday, April 22, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం నుంచి రాజకీయాలకు పూర్తి దూరంగా ఉండనున్నారు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుసగా మూవీలు చేసుకుంటూ బిజీగా అయిపోయారు. తన సినిమాలు తానేదో చేసుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. కానీ ఏపీ రాజకీయాలు మాత్రం చిరును వదలడం లేదు. ఏదొక సందర్భంలో రాజకీయాల్లో చిరంజీవి పేరు ప్రస్తావనకు వస్తోంది. గతంలో సినిమా టికెట్ల పెంపు విషయంలో సీఎం జగన్‌ను కలిసేందుకు ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి వెళ్లడం.. టికెట్లు తగ్గించాలని అభ్యర్థిస్తూ జగన్‌కు నమస్కారం పెట్టడం వంటివి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ఇటీవలే తాను రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంటున్నారని.. తన ఫోకస్ అంతా సినిమాలే అని స్పష్టంచేశారు. అయితే మరోసారి ఆయన నోట రాజకీయ ప్రస్తావన వచ్చింది. ఇందుకు తన తమ్ముడు నెలకొల్పిన జనసేన పార్టీనే కారణమని చెప్పుకోవచ్చు. ఆ పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేశ్ బాబు, అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌కు చిరంజీవి తన మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత రాజకీయాల ప్రస్తావన తీసుకురావడానికి ప్రధాన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్ అని చెప్పారు. జనసేన, బీజీపీ, తెలుగుదేశం ఓ కూటమిగా ఏర్పడటం మంచి పరిణామం అన్నారు.

అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేశ్ తనకు చిరకాల మిత్రుడు అని తెలిపారు. అలాగే పంచకర్ల రమేశ్ బాబు తన అశీసులతో రాజకీయ అరంగేట్రం చేసి ప్రజారాజ్యం పార్టీ తరఫున 2009లో పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి మరోసారి పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు. వీరిద్దరికి ప్రజలు మద్దతు ఇచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఏపీ అభివృద్ధి చెందాలనే తన తపన అని.. కూటమితో అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నట్లు వివరించారు.

ఇటీవల జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయలు విరాళంగా కూడా ఇచ్చారు. అంతేకాదు రామ్ చరణ్‌కు కూడా పార్టీకి ఫండ్ ఇవ్వమని చెప్పారు. దీంతో జనసేనకు తన మద్దతు తెలియజేశారు. తాజాగా కూటమి అభ్యర్థులకు ఓటు వేయమని వీడియో రిలీజ్ చేయడంతో పరోక్షంగా టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చినట్లు అర్థమైంది. ప్రస్తుతం చిరంజీవి ప్రకటన రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ నేతలు చిరంజీవి టార్గెట్‌గా విమర్శలు చేయడం మొదలెట్టారు. వారికి కౌంటర్‌గా జనసేనాని పవన్ కల్యాణ్‌ అజాత శత్రువైన తన అన్న చిరంజీవి జోలికి వస్తే తాటతీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా చిరంజీవి చుట్టూ తిరగడం మొదలైంది.

చిరంజీవిపై విమర్శలు సంగతి పక్కన పెడితే కూటమి అభ్యర్థులకు ఓటు వేయమని ఆయన పిలుపునివ్వడం కొంతమేర ప్రభావం చూపించనుంది. న్యూట్రల్‌గా ఉండే ప్రజలు.. చిరంజీవి అభిమానులు కూటమి వైపు మొగ్గు చూపే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే పార్టీలకు అతీతంగా మెగా అభిమానులు కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి.. పరోక్షంగా తన తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తుండంటంతో కూటమి శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.