close
Choose your channels

Nagababu: చిరంజీవి అంటే ఎవరికైనా అసూయే... అది ఏ ‘‘పాటి’’కైనా : గరికపాటికి నాగబాబు స్వీట్ కౌంటర్

Thursday, October 6, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొణిదెల నాగబాబు.. మెగా బ్రదర్స్‌లో ఒకరు. ఒడ్డూ, పొడుగు అంతా బాగున్నప్పటికీ ఎందుకో ఆయన హీరోగా క్లిక్ కాలేదు. కానీ నిర్మాతగా మాత్రం ఫర్వాలేదనిపించుకున్నారు. అయితే ఆరంజ్ సినిమా ఫెయిల్ కావడంతో అంతా పోయింది. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తిరిగి నిలదొక్కుకున్న ఆయన.. చిన్నా చితకా పాత్రలతో కొనసాగుతున్నారు. ఏది ఏలా వున్నప్పటికీ.. తన సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్‌లపై మాత్రం ఆయన ఈగ వాలనిచ్చేవారు కాదు. ముందు నుంచి ఆయన తత్వం అంతే. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలకు నాగబాబు తనదైన శైలిలో కౌంటరిచ్చారు.

చిన్న ట్వీట్‌తో వంద మాటలు మాట్లాడిన నాగబాబు:

‘‘ ఏ పాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే’’ నంటూ నాగబాబు ట్వీట్ చేశారు. మెగాస్టార్ చుట్టూ చేరి అంతమంది సెల్ఫీలు దిగడం వలన గరికపాటి అసూయ చెందారన్నట్లుగా నాగబాబు వ్యాఖ్యానించారు. తాను ప్రసంగం మొదలెట్టినా... జనం అటెన్షన్‌లోకి రాకపోవడం, చిరంజీవిని వదలకపోవడంతో గరికపాటి వారికి కొంచెం కన్నుకుట్టినట్లుగా వుందేమోనన్న అర్ధం నాగబాబు మాటల్లో కనిపించింది. అందుకే ఆ ఆసూయను ఆగ్రహంగా చూపించారని నాగబాబు ట్వీట్‌ను బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ప్రస్తుతం నాగబాబు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా అభిమానులు దీనిని రీట్వీట్, షేర్లు చేస్తూ మరింతగా వైరల్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే:

విజయదశమిని పురస్కరించుకుని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌లో ఎప్పటిలాగే అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మెగాస్టార్ చిరంజీవితో పాటు గరికపాటి నరసింహారావు ఇతర ప్రముఖులను ఆహ్వానించారు. అయితే చిరంజీవిని చూడగానే అక్కడున్న వారంతా ఆయనను చుట్టిముట్టేశారు. సెల్‌ఫోన్‌లు తీసి చిత్రీకరించడంతో పాటు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. సరిగ్గా అప్పుడే గరికపాటి ప్రసంగం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే చిరంజీవి చుట్టూ వున్న జనం కేకలు, ఈలలు వేస్తూ గోల చేయడంతో నరసింహారావులో సహనం నశించింది. అంతే వేదిక మీద నుంచే ‘‘చిరంజీవిగారు.. మీ ఫోటో సెషన్ ఆపితే.. నేను ప్రసంగం మొదలెడతా’’ నంటూ తీవ్ర స్వరంతో గద్దించారు.

గరికపాటికి చిరంజీవి క్షమాపణలు:

గరికపాటి కామెంట్స్‌తో వెంటనే స్పందించిన చిరంజీవి జనానికి సర్దిచెప్పి ఆ గుంపు నుంచి బయటకు వచ్చేశారు. నరసింహారావుకు క్షమాపణలు చెప్పడంతో పాటు తన ఇంటికి ఓ రోజున భోజనానికి రావాల్సిందిగా కోరారు. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్.. గరికపాటిపై విరుచుకుపడుతున్నారు. మీమ్స్ , కామెంట్స్‌తో ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.