close
Choose your channels

Peach Candy:పీచుమిఠాయి తింటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. నిషేధం విధించిన ప్రభుత్వం..

Saturday, February 17, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పీచు మిఠాయి అంటే మనకి చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తుంటాయి. చిన్నపుడు రోడ్లు మీద పీచు మీఠాయిని తెగ ఆరగించేవాళ్లం కదా. దీనిని ఇంగ్లీష్‌లో కాటన్‌ క్యాండీ అని పిలుస్తారు. అయితే ఇక నుంచి ఆ పీచుమిఠాయి తీపి గుర్తుగానే మిగిలిపోనుంది. అయితే ఇది ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతుందని తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. మనుషుల ఆరోగ్యంపై పీచు మిఠాయి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని తాజాగా చేపట్టిన అధ్యయనాల్లో వెలుగులోకి వచ్చింది. ఇందులో క్యాన్సర్ కారకాల రసాయనాలు ఉన్నాయని వెల్లడైంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం పీచు మిఠాయిని బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక నుంచి రాష్ట్రంలో ఎవరైనా పీచు మిఠాయి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈమేరక స్టాలిన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల చెన్నైలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన ఫుడ్ సేఫ్టే అధికారులు పీచు మిఠాయిలో రోడమైన్ బి అనే కెమికల్ ఉన్నట్లు గుర్తించారు. కృత్రిమ రంగులు వేయడం కోసం దీనిని వినియోగిచినట్లు తేలింది. ఇది వస్త్రాలకు రంగులు వేయడం, పేపర్ ప్రింటింగ్‌లో వినియోగిస్తారు. అందుకే దీనిని నిషేధిస్తూ తమిళనాడు సర్కార్ నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయిని ఎవరు తయారు చేసినా, విక్రయించినా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.

మరోవైపు అంతకుముందు పుదుచ్చేరి ప్రభుత్వం కూడా పీచు మిఠాయిని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. పుదుచ్చేరిలో అనేక దుకాణాలు రోడమైన్ బి అనే డేంజరస్ కెమికల్‌ను ఉపయోగించి దీనిని తయారుచేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బయటపడింది. దీంతో షాపులను సీజ్ చేశారు. ఈ క్రమంలోనే లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటిని బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈ రెండు ప్రభుత్వాల నిర్ణయంపై ప్రజల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

ఈ కాటన్ క్యాండీని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఫెయిరీ ఫ్లాస్, బుద్ధి కే బాల్ అని కూడా పిలుచుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పీచు మిఠాయి అంటారు. అయితే దీనిని ఒకరకమైన షుగర్ సిరప్ నుంచి తయారు చేస్తారు. ఒక మిషన్‌లోని చిన్న రంధ్రం నుంచి పోగులు పోగులుగా ఈ పీచు మిఠాయి బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన పీచు మిఠాయిని ఒక కర్రపై తీసుకుని వివిధ ఆకృతుల్లో తయారు చేస్తారు. అయితే కొందరు వ్యాపారులు భారీ లాభాలకు ఆశపడి ఈ పీచు మిఠాయిని అత్యంత విషపూరితమైన రసాయనాలతో తయారు చేస్తున్నారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం రోడమైన్-బి అనేది గులాబీ నుంచి ఎరుపు రంగుకు ప్రసిద్ధి చెందిన సింథటిక్ డై. సాధారణంగా వస్త్రాలు, సిరాలు, సౌందర్య సాధనాల వంటి పరిశ్రమలలో దీనిని ఉపయోగిస్తారు. అయితే దీనిని ఆహారపదార్థాల్లో వినియోగించడం నిషేధం. కానీ కొంతమంది వ్యాపారులు లాభాల కోసం పీచుమిఠాయి రంగు రంగులుగా కనపడటానికి చట్టవిరుద్ధంగా వినియోగిస్తున్నారు. ఈ కెమికల్ శరీరంలోకి చేరితే క్యాన్సర్ రావడంతో పాటు కాలేయం, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.