టికెట్ ఇచ్చేది లేదని మంత్రికి తేల్చిచెప్పిన చంద్రబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పటికే ఆమెకు మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా అదే ఫ్యామిలీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న సోదరుడికి టికెట్ ఇచ్చి దగ్గరుండి చంద్రబాబు గెలిపించారు. అయితే రానున్న ఎన్నికల్లో.." నా సోదరుడికి, నాకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంతో పాటు నా భర్తకు ఎంపీ టికెట్ ఇవ్వండి" అని సీఎం వద్ద మంత్రి అప్లికేషన్ పెట్టుకున్నారట. ఆమె మాటలు విన్నంత సేపు విన్న సీఎం.. సమస్యే లేదు.. టికెట్ ఇవ్వడం కుదరదని ఎలాంటి మొహమాటం, నాన్చుడు లేకుండా తేల్చిచెప్పారని టాక్. ఇంతకీ ఎవరా మహిళా మంత్రి.. ఎందుకు టికెట్ అడిగారనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
రెండు ఎమ్మెల్యే టికెట్లతో భర్తకు ఎంపీ టికెట్ అడిగిన ఆ మంత్రిగారు ఎవరో కాదండోయ్ భూమా అఖిల ప్రియే.! గత కొద్దిరోజులుగా భూమా ఫ్యామిలీ టీడీపీకి టాటా చెప్పేసి జనసేన గూటికి చేరుతుందని తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత మళ్లీ అఖిల, నంద్యాల ఎమ్మల్యే బ్రహ్మానంద రెడ్డి మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యవహారం సద్దుమణిగిన అనంతరం తన భర్తకు నంద్యాల ఎంపీ సీటిస్తే గెలిపించి మీకు బహుమతిగా ఇస్తాను సార్.. దయచేసి మీరు కాదనకండని సీఎంకు అఖిల అప్లికేషన్ పెట్టుకున్నారట. ఇందుకు స్పందించిన సీఎం ఇప్పటికే మీ కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లిచ్చాం.. మీరు ఊహించని మంత్రి పదవి కూడా ఇచ్చి అన్ని విధాలా అండగా ఉంటూ వచ్చాం మళ్లీ ఇంకో ఎక్స్ట్ ట్రా సీటంటే కుదరని పనని చంద్రబాబు తేల్చిపారేశారట.
అసలే అసంతృప్తితో రగలిపోతున్న మంత్రి అఖిల ప్రియ.. బాబు రియాక్షన్తో ఒకింత కంగుతిన్నారట. అయితే ఆమెగారి భర్త రాజకీయాల్లోకి రావాలని ఎప్పట్నుంచో తహతహలాడుతున్నారట. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంతో మనసులోని మాటను భార్య చెవిన పడేయడంతో టికెట్ కోసం అఖిల ఈ భగీరథ ప్రయత్నాలన్నీ చేశారని సమాచారం. అయితే ఇప్పటికే ఆ నంద్యాల నియోజకవర్గం నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ ఫిరాయింపు నేత ఎస్పీవై రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. తాను మరోసారి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. నంద్యాల అసెంబ్లీ టికెట్ కూడా తన అల్లుడికి ఇవ్వాలని సీఎంను కోరానని కూడా చెప్పుకొచ్చారు. దీంతో అటు ఎమ్మెల్యే.. ఇటు ఎంపీ టికెట్కు గట్టి పోటీ ఏర్పడినట్లైంది. ఈ తరుణంలో చంద్రబాబు ఎవరికీ హామీ ఇవ్వకుండా మిన్నకుండిపోయారని తెలుస్తోంది.
అయితే చంద్రబాబు ఒక్క నంద్యాలలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఒకటికి రెండుసార్లు సొంతంగా సర్వే చేయించుకున్నారని ఈ నెల చివరన లేదా.. ఫిబ్రవరి నెలలో జాబితా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వినవస్తున్నాయి. అయితే ఆ తొలి జాబితాలో నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరి పేరు వస్తుందో వేచి చూడాల్సిందే మరి. అభ్యర్థుల ప్రకటన తర్వాత అఖిల అసలేం చేయబోతున్నారు..? అసలు టీడీపీలో కొనసాగుతారా లేకుంటే టాటా చెప్పేసి ఫిరాయిస్తారా అనేది ఆ అభ్యర్థుల ప్రకటన మీదే ఆధారపడి ఉందన్న మాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.