close
Choose your channels

CM Revanth Reddy:ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావ్.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..

Friday, April 19, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావ్ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్‌ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌కు కాలం చెల్లిందని.. కారు షెడ్డుకు వెళ్లిందని ఎద్దేవా చేశారు. తన పార్టీ ఎమ్మెల్యేలను కంచె వేసి కాపాడుకుంటానని తెలిపారు.

తాను తలచుకుంటే కేసీఆర్ పార్టీలో ఎంత మంది ఎమ్మెల్యేలు మిగులుతారో లెక్కేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కారును బొంద తీసి పాతి పెట్టారని సెటైర్లు గుప్పించారు. ఇక్కడ ఎమ్మెల్యేలకు కాపలా ఉంది రేవంత్ రెడ్డి.. హై టెన్షన్ వైర్ లాంటి తనను ముట్టుకుంటే మాడి మసైపోతావ్ అని మండిపడ్డారు. బీజేపీ-బీఆర్ఎస్ కుమ్మకై కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. 10 ఏళ్లు రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు గెలిపిస్తే ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. కృష్ణానది పక్కనే ప్రవహిస్తున్న పాలమూరులో ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదని నిలదీశారు.

కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. పాలమూరు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి దేశం నలుమూలలు తిరిగి పాలమూరు ప్రతిష్ఠ పెంచారన్నారు. కేంద్రం నుంచి రూ.30వేల కోట్లు నిధులను తీసుకువచ్చి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గజ్వేల్ దొర(కేసీఆర్)- గద్వాల గడీల దొరసాని(డీకే అరుణ) ప్రజలను బానిసల్లాగా మార్చుకున్నారంటూ రేవంత్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో పాలమూరుకి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరుకి ఇప్పుడు సువర్ణ అవకాశమొచ్చిందని తెలిపారు. జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలను గెలిపించాలని.. జిల్లాలను మరింతగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.