ప్రముఖ దర్శక, నిర్మాత బాపినీడు ఇకలేరు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు అలియాస్ గుట్టా బాపినీడు చౌదరి తుదిశ్వాస విడిచారు. మంగళవారం ఉదయం ఆయన అకాల మరణం చెందినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. 1936 సెప్టెంబర్ 22న పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రులో ఆయన జన్మించారు. చిత్రసీమలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన్ను అందరూ విజయ బాపినీడుగా పిలవడం మొదలుపెట్టారు. ఇలానే ఆయన టాలీవుడ్లో బాగా ఫేమస్ అయ్యారు. కాగా.. తన కుమార్తెలు నిర్మించిన ‘కొడుకులు’ అనే చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా స్వయంగా ఆయన దగ్గరుండి అన్నీ చూసుకుని సినిమా సూపర్ డూపర్ హిట్ చేశారు.
దర్శకత్వం వహించిన సినిమాలు
డబ్బు డబ్బు డబ్బు (1981), పట్నం వచ్చిన పతివ్రతలు (1982), మగమహారాజు (1983), మహానగరంలో మాయగాడు (1984), హీరో (1984), భార్యామణి (1984), మహారాజు (1985), కృష్ణగారడి (1985), మగధీరుడు (1986), నాకు పెళ్ళాం కావాలి (1987), ఖైదీ నెంబరు 786 (1988), దొంగకోళ్ళు (1988), మహారజశ్రీ మాయగాడు (1988), జూలకటక (1989), మహాజనానికి మరదలు పిల్ల(1990), గ్యాంగ్ లీడర్ (1991), బిగ్ బాస్ (1995), కొడుకులు (1998), ఫ్యామి (1994) సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. కాగా ఈయన అప్పట్లోనే ‘యవ్వనం కాటేసింది’ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.
బాపినీడు ట్రాక్ రికార్డ్..
బీఏ వరకు చదివిన ఆయన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. గుత్తా బాపినీడు పేరుతో రచనలు చేసిన ఆయన మద్రాస్లో బొమ్మరిల్లు విజయ మాస పత్రికలు ప్రారంభించారు. అప్పట్లో ఈయన రాసిన జగత్ జెట్టిలు కథ సినిమాగా వచ్చింది. అనంతరం శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ సంస్థను నెలకొల్పి దాసరి దర్శకత్వంలో ‘యవ్వనం కాటేసింది’ సినిమా తీశారు. అనంతరం బొమ్మరిల్లు, ప్రేమ పూజారి, విజయ, బొట్టు-కాటుకు సినిమాలు తీశారు. మురారీతో కలిసి జై గంటలు నిర్మించారు. 12 సినిమాలు ఇతర దర్శకులతో తీశారు.
మెగా డైరెక్టర్గా గుర్తింపు..
బాపినీడు ఎక్కువగా చిరంజీవితోనే సినిమాలు చేశారు. ముఖ్యంగా'మగ మహారాజు', ‘మహానగరంలో మాయగాడు’, ‘మగధీరుడు’, ‘ఖైదీ నంబర్ 786’, ‘గ్యాంగ్ లీడర్’, ‘బిగ్ బాస్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ను చిరుకు ఆయన అందించారు. సూపర్స్టార్ కృష్ణతో ‘కృష్ణ గారడి’, రాజేంద్రప్రసాద్తో ‘వాలు తోలు బెల్ట్’, ‘దొంగ కోళ్లు’ సినిమాలు తీశారు. అంతేకాదు పలువురు ప్రముఖులను.. ఇప్పుడు సంగీతం, దర్శకత్వంలో పేరుపొందిన వారిని ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మాటల రచయితగా కాశీ విశ్వనాథ్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత బాపీనీడుదే. బాపినీడు మరణవార్త తెలుసుకున్న ఇండస్ట్రీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. మెగస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. బుధవారం ఆయన అంత్యక్రియలు స్వగ్రామంలో జరుగుతాయని తెలిసింది. ఈ కార్యక్రమానికి చిరుతోపాటు పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖలు హాజరవుతారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.