బీజేపీకి టచ్లో మాజీ సీఎం.. బాంబ్ పేల్చిన ఏపీ ఎమ్మెల్సీ!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపిన విషయం విదితమే. ఇందులో భాగంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలకు కాషాయ కండువాలు కప్పే పనిలో కమలనాథులు బిజీబిజీగా ఉన్నారు. అయితే త్వరలో మరికొందరు కీలకనేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని రోజుకో బీజేపీ నేత ప్రకటన చేస్తూ వస్తున్నారు. తాజాగా.. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్సీలు బీజేపీతో టచ్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. అయితే రాజీనామా చేసి వచ్చే విషయం అడ్డంకిగా మారిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటన కారణంగా తమ పార్టీలోకి వలసలకు ఇబ్బంది కలిగిందన్నారు.
బీజేపీలోకి ఊహించని నేత!!
అంతటితో ఆగని మాధవ్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నారని ఉన్నట్టుండి బాంబ్ పేల్చారు. వాస్తవానికి విభజన అనంతరం ‘జై సమైఖ్యాంధ్ర పార్టీ’ని స్థాపించి పోటీచేసిన కిరణ్ రెడ్డి.. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ సొంత గూడైన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే తాజాగా.. మాధవ్ చేసిన ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. మొత్తానికి చూస్తే.. మాధవ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఊహించని వ్యక్తే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారన్న మాట.
ఎన్నికలకు ముందు ఆ ఇద్దరూ..!
ఆగస్ట్ నెల తరువాత కీలక పరిణామాలు ఉంటాయని మాధవ్ చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ఒక కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, ధర్మాన బీజేపీతో టచ్లో ఉన్నారని షాకింగ్ విషయం బయటపెట్టారు. సామాజిక న్యాయం నినాదంతో జనంలోకి వెళ్తామని మాధవ్ తెలిపారు. బీజేపీ పార్టీ అధ్యక్షుడి మార్పు ప్రతి మూడేళ్లకు ఒకసారి జరుగుతుందని మాధవ్ స్పష్టం చేశారు. అయితే మాధవ్ వ్యాఖ్యలపై కిరణ్ రెడ్డి, బొత్స, ధర్మాన ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.