ఎనిమిది మంది ఐఏఎస్లకు జైలు శిక్ష, జరిమానా విధించిన ఏపీ హైకోర్టు.. ఎందుకంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి 8 మంది ఐఏఎస్లకు హైకోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. ఈ ఐఏఎస్ల అధికారుల్లో గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, రాజశేఖర్, చినవీరభద్రుడు, జె.శ్యామలరావు తదితరులున్నారు. దీంతో ఈ ఎనిమిది మంది ఐఏఎస్లు హైకోర్టును క్షమాపణలు కోరారు. స్పందించిన ఉన్నత న్యాయస్థానం జైలు శిక్ష తప్పించి సేవా కార్యక్రమాలకు ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లలో నెలలో ఒక రోజు వెళ్లి సేవ, ఏడాది పాటు హాస్టళ్లలో సేవా కార్యక్రమం చేపట్టాలని తెలిపింది. దీంతో పాటు ఒక రోజు కోర్టు ఖర్చులు భరించాలని ఆదేశించింది.
కాగా.. గతేడాది సెప్టెంబర్లోనూ నలుగురు ఐఏఎస్ అధికారులు రావత్, ముత్యాలరాజు, శేషగిరిరావు, మన్మోహన్ సింగ్లకు హైకోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. 2015లో భూమి వ్యవహారంలో నష్టపరిహారం చెల్లించమని తాము ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయనందున ఈ శిక్షలను విధిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. ముత్యాలరాజుకు రెండు వారాల జైలు, వేయి రూపాయల జరిమానా, ఏఎస్ రావత్ కు నెలరోజుల జైలు శిక్ష, వేయిరూపాయల జరిమానా, అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుకు రెండువారాల జైలు శిక్ష, వేయిరూపాయల జరిమానా, రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ కు రెండువారాల జైలు శిక్ష వేయిరూపాయల జరిమానాను ధర్మాసనం విధించింది. అలాగే బాధిత మహిళకు లక్షరూపాయలను ప్రభుత్వ నిధి నుంచి కాకుండా అధికారుల సొంత డబ్బులను చెల్లించాలని తీర్పునిచ్చిన వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.