close
Choose your channels

KCR:కేసీఆర్‌కు కోలుకోలేని షాక్‌లు.. వరుసగా పార్టీని వీడుతున్న కీలక నేతలు..

Friday, March 29, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని షాక్‌లు తగులుతున్నాయి. వరుసగా కీలక నేతలందరూ కారు దిగిపోతున్నారు. దీంతో గులాబీ బాస్‌కు ఊపిరి సలపడం లేదు. నమ్మిన నేతలే కష్టకాలంలో తపపే వదిలి వెళ్తున్నారంటూ వాపోతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, తదితర నాయకులు కారు దిగి కాంగ్రెస్, బీజేపీలోకి చేరిపోయారు. తాజాగా కేసీఆర్(KCR) తర్వాత కీలక నేతలుగా ఉండే కే.కేశవరావు, కడియం శ్రీహరి కూడా పార్టీకి గుడ్ బై చెప్పడం జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలోనే వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య(Kadiyam Kavya) పోటీ నుంచి తప్పుకొన్నారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. 'ఇటీవల మీడియాలో వస్తోన్న కథనాలు, అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. అంతేకాకుండా వరంగల్ జిల్లాలో పార్టీ నాయకుల మధ్య సమన్వయం లోపించింది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఒకరికొకరి మధ్య సహకారం కొరవడింది. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. అధినేత కేసీఆర్, పార్టీ కార్యకర్తలు నన్ను మన్నించాలి' అని లేఖలో పేర్కొన్నారు.

కాగా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యను వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. అయితే ఇప్పుడు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ఏకంగా కేసీఆర్‌కు లేఖ రాయడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. శ్రీహరితో పాటు కావ్య కూడా హస్తం కండువా కప్పుకోనున్నారు. మరోవైపు సీనియర్ నేత కేశవరావు, ఆయన కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

కాగా ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కేశవరావు కలిసి పార్టీ మార్పుపై వివరణ ఇచ్చారు. తాను ఎందుకు పార్టీ మారుతున్నదీ వివరించారు. అయితే కేకే నిర్ణయంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పదేళ్ల పాటు పార్టీలో పెద్ద పీట వేసి పదవులు ఇస్తే.. కష్టకాలంలో వదిలేసి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అనతంరం కేకే మీడియాతో మాట్లాడుతూ 'నేను పుట్టింది కాంగ్రెస్ పార్టీలో.. కాంగ్రెస్‌లోనే చనిపోతాను' అని తెలిపారు. అటు అధికార పార్టీలో ఉంటేనే సమస్యల పరిష్కారం సులువు అవుతుందని విజయలక్ష్మి కూడా వెల్లడించారు. వీరితో పాటు మాజీ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

దీంతో కేసీఆర్‌కు ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిన గులాబీ బాస్‌కు కీలకమైన పార్లమెంట్ ఎన్నికల సమయంలో సన్నిహితంగా ఉండే సీనియర్ నేతలు పార్టీని వీడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఓవైపు కవిత అరెస్ట్.. మరోవైపు ఫోన్ ట్యాపింగ్, భూకబ్జాల కేసులు, ఇంకోవైపు నేతల వలసలతో బీఆర్ఎస్ పార్టీ కకావికలమవుతోంది. మరి ఇన్ని ఇబ్బందులను అధిగమించి పార్టీని కాపాడుకుని తిరిగి గాడిన పెట్టడం కేసీఆర్ కుటుంబానికి కత్తి మీద సాము లాంటిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.