close
Choose your channels

Naveen Yerneni: మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేనిపై కిడ్నాప్ కేసు

Monday, April 15, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Naveen Yerneni: మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేనిపై కిడ్నాప్ కేసు

మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒక్కరైన నవీన్ యెర్నేనిపై కిడ్నాప్ కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌లోని క్రియా హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ షేర్ల బదలాయింపు వ్యవహారంలో నవీన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బలవంతంగా షేర్ల బదాలయించడం, బెదిరింపులతో కంపెనీ యాజమాన్య మార్పిడి ఆరోపణల నేపథ్యంలో నవీన్‌పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారిస్తామని వెల్లడించారు.

జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు, ఎస్సై మల్లికార్జున్‌ సహా పలువురు నిందితులపై పంజాగుట్ట స్టేషన్‌లో పలు కేసులు నమోదు అయ్యాయి. ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత కొన్నేళ్ల క్రితం తనకు జరిగిన అన్యాయంపై ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త చెన్నుపాటి వేణుమాధవ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులను సంప్రదించాడు. ట్యాపింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు తనను కూడా బెదిరించినట్టు ఫిర్యాదు చేశాడు.

ఈ కేసులో ఉన్న నిందితులు తనను గతంలో కిడ్నాప్‌ చేసి తన కంపెనీ షేర్లను బలవంతంగా బదలీ చేసుకున్నారని.. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారికి సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ వ్యవహారంలో పోలీసులతో పాటు తన సంస్థకు చెందిన నలుగురు డైరెక్టర్లకు సైతం లబ్ధి చేకూరినట్లు తెలిపాడు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ సంస్థ ఎండీగా వ్యవహరించిన రాజశేఖర్‌ తలసిల, డైరెక్టర్లుగా ఉన్న గోపాలకృష్ణ సూరెడ్డి, నవీన్‌ యర్నేని, రవికుమార్‌ మందలపు, వీరమాచినేని పూర్ణచందర్‌రావులను తాజాగా నిందితుల జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్లకూ నోటీసులిచ్చి విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Naveen Yerneni: మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేనిపై కిడ్నాప్ కేసు

జూబ్లీహిల్స్‌కు చెందిన ఎన్నారై వ్యాపారి చెన్నుపాటి వేణుమాదవ్‌ క్రియా హెల్త్‌ కేర్‌ను నెలకొల్పారు. అది లాభాలతో వృద్ధిలోకి వస్తున్న క్రమంలో టేకోవర్‌ చేసేందుకు సంస్థ డైరెక్టర్లు కొందరు ప్రముఖుల సాయంతో పథకం వేసినట్లు గుర్తించారు. ఇందులో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజకీయ ప్రముఖుల ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 2018లో వేణుమాధవ్‌ను కిడ్నాప్‌ చేసి రూ.40 కోట్ల విలువ చేసే షేర్లను అక్రమంగా బదలాయించారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని రాధాకిషన్‌ రావు స్వయంగా బాధితుడిని బెదిరించారు.

కాగా ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ డీసీసీగా పనిచేసిన రాధాకిషన్‌రావు అరెస్టు కావడంతో వేణుమాదవ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు రాధాకిషన్‌రావు, గట్టుమల్లు, మల్లికార్జున్‌తోపాటు కృష్ణ, గోపాల్‌, రాజ్‌, రవి, బాలాజీ, చంద్రశేఖర్‌ వేగేతో పాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.

 
 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.