Balakrishna:మరోసారి వివాదాస్పదమైన బాలయ్య తీరు.. ఈసారి సొంత అభిమానుల నుంచే, నందమూరి ఫ్యాన్స్ చీలిపోతారా..?


Send us your feedback to audioarticles@vaarta.com


టాలీవుడ్ అగ్రకథానాయకుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల వివాదాలకు కేరాఫ్గా నిలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితం దేవాంగ కమ్యూనిటీపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై బాలయ్య క్షమాపణలు చెప్పారు కూడా. ఆ తర్వాత కొద్దిరోజులకే వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో మహానటులు అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావులపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపాయి. ఈ వివాదం సద్దుమణగకముందే.. అన్స్టాపబుల్ షోలో నర్సులను ఉద్దేశిస్తూ అన్న మాటలపై నర్సుల సంఘం భగ్గుమంది. తక్షణం ఆయన క్షమాపణలు చెప్పాలని, ఆ మాటలను వెనక్కి తీసుకుకోవాలని ఆంధ్రప్రదేశ్ నర్సుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.
బాలయ్యపై ట్రోలింగ్ :
తాజాగా ఆయనపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల మరణించిన నందమూరి తారకరత్న దశదిన కర్మ గురువారం హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి బాలయ్య హాజరై అంతా తానై చూసుకున్నారు. అయితే ఇదే కార్యక్రమానికి వచ్చిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను బాలయ్య కనీసం పలకరించలేదు. బాబాయ్ రాకను గమనించిన అన్నదమ్ములిద్దరూ లేచి నిల్చున్నారు. కానీ వీరిని బాలకృష్ట పట్టించుకోలేదు. ఎన్టీఆర్ పక్కన వున్న వాళ్లను మాత్రం పలకరించి అలా ముందుకు సాగిపోయారు.
ఎన్టీఆర్-కళ్యాణ్రామ్లను పట్టించుకోని బాలయ్య :
దీంతో బాలయ్యపై జూనియర్ ఫ్యాన్స్ గరమవుతున్నారు. బాబాయ్ వచ్చారని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు లేచి నిలబడి గౌరవం ఇస్తే.. వాళ్లను దూరం పెట్టినట్లుగా బాలయ్య వ్యవహరించారని అబ్బాయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే నందమూరి కుటుంబంలో కొందరికి ఇష్టం లేదని, దీంతో ఆయనను ఓ ప్లాన్ ప్రకారం దూరం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇవన్నీ కలిపి నందమూరి అభిమాన వర్గంలోని జూనియర్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో నందమూరి అభిమానుల్లో చీలిక వస్తుందా అన్న చర్చ మొదలైంది. మరి దీనిపై బాలయ్య , జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న:
కాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ కుప్పంలో ఇటీవల యువగళం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారకరత్న కూడా హాజరయ్యారు. అభిమానుల తాకిడి, ఎండ ప్రభావం ఎక్కువగా వుండటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్రకు సిద్ధమవుతూ వుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేయించారు. ఆ వెంటనే పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్నను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. తారకరత్న మరణంతో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments