close
Choose your channels

అజయ్.. శ్రద్ధా దాస్.. ఆమని ప్రధాన తారలుగా సైకలాజికల్ థ్రిల్లర్ 'అర్థం' 

Friday, December 11, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అజయ్, శ్రద్ధా దాస్, ఆమని ప్రధాన తారలుగా రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'అర్థం'. ఈ చిత్రానికి 'నాటకం' చిత్రనిర్మాతల్లో ఒకరైన రాధికా శ్రీనివాస్ నిర్మాత. ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి రచయిత, దర్శకుడు.

'దేవి', 'పెదరాయుడు' చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర, రామ్ గోపాల్ వర్మ 'మర్డర్'లో కథానాయికగా నటించిన సాహితీ అవంచ, నటుడిగా మారిన దర్శకుడు దేవి ప్రసాద్, తమిళ హిట్ చిత్రం 'వడ చెన్నై'లో ప్రతినాయకులుగా నటించిన సాయి దీనా, వాసు విక్రమ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

'అర్థం' చిత్రీకరణ దాదాపుగా 50 శాతం పూర్తయింది.

ఈ సందర్భంగా నిర్మాత రాధికా శ్రీనివాస్ మాట్లాడుతూ "ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథాంశంతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. నవంబర్ 7వ తేదీన పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక షెడ్యూల్, చెన్నైలో మరో షెడ్యూల్ షూటింగ్ చేశాం. దాదాపుగా సగం సినిమా పూర్తయింది. త్వరలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మణికాంత్ తెల్లగూటి అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆయనే ఎడిటింగ్ కూడా చేస్తున్నారు. తెలుగులో 'ఖైదీ'కి అద్భుతమైన మాటలు, పలు చిత్రాల్లో పాటలు రాసిన రాకేందు మౌళి మా సినిమాకి మాటలు, పాటలు రాస్తున్నారు. సన్నీ ఆస్టిన్, చిన్న స్వామి చక్కటి బాణీలు అందిస్తున్నారు" అని అన్నారు.

దర్శకుడు మణికాంత్ తెల్లగూటి మాట్లాడుతూ "కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న సినిమా - 'అర్థం'. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాకి వినోదం మేళవించి ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నాం. వీఎఫ్ఎక్స్‌లో నాకు అనుభవం ఉండటంతో సినిమా వీఎఫ్ఎక్స్‌ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నాను. అత్యుత్తమ నిర్మాణ విలువలతో సినిమా రూపొందుతోంది" అని అన్నారు.

అజయ్, శ్రద్దా దాస్, ఆమని, మహేంద్ర, సాహితీ అవంచ, దేవి ప్రసాద్, సాయి దీనా, వాసు విక్రమ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి, మాటలు-పాటలు: రాకేందు మౌళి , కె శివ సిద్ధార్థ్ , ఛాయాగ్రహణం: శేఖర్ గంగనమోని, సంగీతం: సన్నీ ఆస్టిన్, చిన్న స్వామి, అసోసియేట్ నిర్మాత: ఉమా కూచిపూడి, సహా నిర్మాతలు: పవన్ జానీ, వెంకట రమేష్, నిర్మాత: రాధికా శ్రీనివాస్, కూర్పు-రచన-దర్శకత్వం: మణికాంత్ తెల్లగూటి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.