close
Choose your channels

సీఎం జగన్ ఉదారత.. ఒక్కో వలస కూలీకి రూ. 500!

Wednesday, May 6, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీఎం జగన్ ఉదారత.. ఒక్కో వలస కూలీకి రూ. 500!

వలస కూలీల విషయంలో ఉదారంగా ఉండాలని, సంకోచించకుండా.. చొరవ తీసుకొని అవసరమైన వారికి సహాయం చేయాలని అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యలపై ఇవాళ సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన వలస కూలీలు.. అదే విధంగా ఏపీలో ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీల తరలింపుపై అధికారులతో చర్చించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చొరవ తీసుకోండి..

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ఏపీలో ఉన్న ఇతర రాష్ట్రాల కూలీలకు షెల్టర్‌ ఏర్పాటు చేసి వారికి భోజనం, తదితర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. వారు వివిధ పరిశ్రమల్లో పనులకు వెళ్తానంటే సహకారం అందించాలని, లేదా తమ రాష్ట్రాలకు వెళ్లిపోతామంటే కావాల్సిన ప్రయాణ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇందుకు అవసరమైన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఈ విషయంలో సంకోచించకుండా చొరవ తీసుకుని వారికి తగిన విధంగా సహాయం చేయాలని సూచించారు. వెళ్లేటప్పుడు దారి ఖర్చులకు రూ.500లు ఒక్కో కూలీకి ఇవ్వాలని ఆదేశించారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా..

ఇతర రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర కూలీలు ఏపీకి వచ్చేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు ముందుకు రాకపోతే వెనకడుగు వేయకుండా వారికి ప్రయాణ సదుపాయాలు కూడా కల్పించే ఏర్పాటు చేయాలని జగన్‌ ఆదేశించారు. అంతేగాకుండా మెడికల్‌ ఎమర్జెన్సీ ఉన్నవారి ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో విదేశాల నుంచి పలువురు విమానాల్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులకు చేరుకుంటారని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వారికి అక్కడే మెడికల్‌ స్క్రీనింగ్‌ చేయిస్తామని.. అనంతరం మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్‌ చేసి పర్యవేక్షణ కొనసాగిస్తామని వెల్లడించారు. ఆ తర్వాతే వారిని స్వస్థలాలకు పంపిస్తామని స్పష్టం చేశారు.

పరీక్షలు చేస్తున్నాం..

విదేశాల నుంచి వస్తున్న వారిలో ఆయా దేశాల్లో కరోనా తీవ్రత ఆధారంగా వారిని వర్గీకరిస్తున్నామని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో గల్ఫ్‌ దేశాల నుంచి వస్తున్న వారికి కూడా క్వారంటైన్‌ సదుపాయాలపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇక మహారాష్ట్రలోని థానే నుంచి 1000 మందికి పైగా వలసకూలీలు గుంతకల్‌ వచ్చారని, వీరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులకు సీఎంకు వివరించారు. డిశ్చార్జి కేసుకు సంబంధించి పటిష్టమైన ప్రోటోకాల్‌ పాటిస్తున్నామని, వరుసగా రెండు పరీక్షల్లో నెగెటివ్‌ వస్తేనే డిశ్చార్జి చేస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు. కరోనా కేసులు డిశ్చార్జిలో దేశ సగటు 28.63 శాతం ఉంటే  రాష్ట్రంలో 41.02 శాతం ఉందని, అదే విధంగా పాజిటివ్‌ కేసుల్లో రాష్ట్రంలో సగటు 1.26 శాతం అయితే దేశంలో 3.87 శాతం ఉందని తెలిపారు. వైయస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌లో భాగంగా సబ్‌ సెంటర్లకు మందులు పంపించి డాక్టర్ల ఇచ్చిన ప్రిస్కిప్షన్‌  ఆధారంగా వారికి మెడిసిన్‌ పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos