close
Choose your channels

Supreme Court:సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం..

Thursday, February 15, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు వెల్లడించింది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంచేసింది. నల్లధనం నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్‌ ఒక్కటే మార్గం కాదని.. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకి దారి తీస్తుందని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 19(1)(ఏ)తో పాటు సమాచార హక్కు చట్టానికి ఈ బాండ్లు విఘాతం కల్గిస్తున్నాయని స్పష్టంచేసింది. ఇది కచ్చితంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్కొంది. చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఏకగ్రీవ తీర్పు వెలువరించింది.

అలాగే ఎలక్టోరల్ బాండ్స్ జారీ చేయడాన్ని తక్షణమే నిలిపేయాలని ఎస్బీఐని ఆదేశించింది. 2019 ఏప్రిల్ 19 నుంచి ఎలక్టోరల్ బాండ్స్ బాండ్స్ కొన్నవారి వివరాలను ఈసీకి సమర్పించాలని సూచించింది. మార్చి 31లోపు ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచాలని తెలిపింది. దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ సుప్రీకోర్టు తీర్పు రాజకీయ పార్టీలకు బిగ్ షాక్ ఇచ్చింది.

కాగా 2018లో కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్లు స్కీమ్‌ని తీసుకొచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A కింద నమోదైన రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్లకు అర్హత కలిగి ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించాలంటే ఆ పార్టీలకు ఎన్నికల్లో కనీసం ఒక్క శాతం ఓట్లు వచ్చి ఉండాలి. ఈ బాండ్ల ద్వారా గత ఆరున్నర ఏళ్లలో రూ.9,188 కోట్లకు పైగా విరాళాలను ఆయా పార్టీలు సేకరించాయి.

అత్యధికంగా బీజేపీకి ఈ బాండ్లు ద్వారా విరాళాలు వచ్చినట్లు సమాచారం. బ్లాక్‌మనీని అడ్డుకునేందుకే ఈ స్కీమ్ తీసుకొచ్చామని కేంద్రం చెబుతోంది. అయితే దీనిని కొంతమంది సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌లు వేశారు. ఈ పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు గతేడాది అక్టోబర్‌ 31న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సంచలన తీర్పు ఇచ్చింది.

మరోవైపు ఎన్నికల వ్యవస్థపై ప్రభావం చూపే కీలక తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చిందని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు. వార్షిక లాభాల్లో ఏడున్నర శాతం రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వొచ్చన్న నిబంధనను తొలగిస్తూ.. ఎంతైనా విరాళం ఇచ్చేలా కంపెనీస్ యాక్ట్ సవరణలను తేవడం రాజ్యాంగ విరుద్ధం అని ధర్మాసనం స్పష్టం చేసిందన్నారు. రాజకీయ పార్టీలకు ఎవరు విరాళాలు ఇస్తున్నారన్న కనీస సమాచారం ప్రజలకు తెలియాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తంచేసినట్లు ఆయన వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment