close
Choose your channels

YS Sharmila:ప్రత్యేక హోదా కోసం.. సీఎం జగన్, చంద్రబాబుకు వైయస్ షర్మిల లేఖాస్త్రాలు..

Wednesday, February 7, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) దూకుడు పెంచారు. ఓవైపు పార్టీని ప‌రుగులు పెట్టిస్తూనే మ‌రోవైపు విభజన హామీల అమలు కోసం పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అలాగే ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ కేంద్రంగా నిర‌స‌న కూడా వ్యక్తం చేశారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విభజన హామీలు అమ‌లు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల‌ని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి(YS Jagan Mohanreddy), ప్రతిప‌క్షనేత చంద్రబాబు(Chandrababu)కు లేఖలు రాశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లుగా రాష్ట్రానికి చేసిన ద్రోహం అసెంబ్లీ వేదికగా చర్చించి హామీల అమలుకై ఏకగ్రీవ తీర్మానం చేపట్టాలని సూచించారు. ఈ తీర్మానాన్ని వెంటనే కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని ఆమె కోరారు.

లేఖలోని అంశాలు..

ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం గడిచిన పదేళ్లలో అటు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో మొదటి ఐదేళ్లు టీడీపీ, ఇప్పుడు వైసీపీ పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నా పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరం, అత్యంత బాధాకరం.

తెలంగాణ ఏర్పాటులో భాగంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరగకుండా అభివృద్ధి, పునర్నిర్మాణం అత్యంత వేగంగా జరగాలనే ఉద్దేశ్యంతో, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం- 2014లో ప్రత్యేక హోదా సహా పోలవరానికి జాతీయ హోదా వంటి ముఖ్యమైన హామీలు పొందుపరిచారు. కానీ విభజన అనంతరం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ ఆ హామీలను పూర్తిగా పక్కనపెట్టేసింది.

నాడు బీజేపీతో అప్రక‌టిత పొత్తులో ఉన్న మీ పార్టీ.. ఐదున్నర కోట్ల ప్రజల ఆశలను, ఆశయాలను తీర్చే హామీలను సాధించుకోవడానికి పోరాటం చేయలేదు. రాష్ట్రానికి జరిగిన చారిత్రిక అన్యాయాన్ని సరిచేస్తామనే వాగ్దానంతో 2019లో వైసీపీ(YSRCP) అధికారంలోకి వచ్చింది. కానీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది.

2014లో అధికారంలోకి వచ్చాక కేంద్రంలోని బీజేపీతో పొత్తులో ఉండి కూడా ప్రత్యేక హోదా సాధించలేకపోయాం. అటు పోలవరం పునరావాసంతో కలిపి వ్యయం భరిస్తూ కేంద్రం కట్టాలని చట్టంలో ఉన్నా నేటికీ ప్రాజెక్టు నిర్మాణం ముందుకు కదలట్లేదు. అయినా విభజన హామీలపై టీడీపీ నిలదీసే ప్రయత్నం చేయడం లేదు. హోదా కావాలని ఒకసారి, హోదా అవసరం లేదని మరోసారి మాట మారుస్తూ ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆశలపై నీళ్లు చల్లిన మీరు ఇప్పటికైనా కళ్లు తెరవాలి.

విభజన జరిగి పదేళ్లయినా ఇప్పటికీ ఐదున్నర కోట్ల మంది ఆంధ్రులు నైరాశ్యంలో ఉండి ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు ఏంటని అల్లాడిపోతున్నారు. తమ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే విభజన హామీల అమలు కోసం ఎదరుచూస్తున్నారు.

ఆనాడు సిరి సంపదలు, సంక్షేమం, అభివృద్ధితో పాటు దేశానికే అన్నపూర్ణగా ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం, నేడు అన్నిరంగాల్లో నిర్లక్ష్యానికి గురవుతున్న విషయాన్ని మీరు గమనిస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా అన్నిటికీ సంజీవని అని చెప్పిన మీ పార్టీ.. మళ్లీ మాతో కలిసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పోరు ఉధృతం చెయ్యాలని మేము కోరుకుంటున్నాం.

ప్రజల గొంతుకగా, వారి ఆశలకు దర్పణంగా, నిబద్దతతో విభజన హామీలపై కలిసి పోరాడదామని కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ష‌ర్మిల పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై, రాజకీయాలకు అతీతంగా, రాష్ట్రంకోసం నిలబడి, కలబడాలని పిలుపునిస్తున్నాము.

అఖిలపక్షాన్ని తీసుకువెళ్లి ఢిల్లీలో మన రాష్ట్ర గళం విప్పాలని ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని, ఒత్తిడి తీసుకురావాలని, దీనికోసం మీరు మాతో కలిసిరావాలని విజ్ఞప్తి చేస్తున్నము. దీనికి మీరు చొరవ చూపితే, కాంగ్రెస్ అన్నివిధాలుగా సహకరిస్తుందని, రాష్ట్ర భవిష్యత్తు తరవాతే మాకు ఏదైనా అని కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున తెలియ‌జేస్తున్నాం.

అమలు కాని విభజన హామీలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా

విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్

రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనకబడిన ప్రాంతాలకు నిధులు

కడపలో ఉక్కు ఫ్యాక్టరీ

విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్

కొత్త రాజధాని నగర నిర్మాణం

విశాక ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ కాకుండా ఆపాలి

ఏపీ అభివృద్ధి, ఐదున్నర కోట్ల మంది ప్రజల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ విన్నపాలు, డిమాండ్లపై వెంటనే సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని షర్మిల విజ్ఞప్తి చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.