close
Choose your channels

దేశంలో విజృంభిస్తున్న బర్డ్‌ఫ్లూ.. తెలుగు రాష్ట్రాల పరిస్థితేంటంటే..

Saturday, January 9, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశంలో బర్డ్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రతాపాన్ని చూపిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా, గుజరాత్‌ రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కోరలు చాస్తోంది. దీంతో ఈ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఈ వైరస్ నుంచి బయటపడేందుకు కార్యాచరణను రూపొందించాలని ఆదేశించింది. పౌల్ట్రీ రైతులకు అవగాహన కల్పించాలని తెలిపింది. ఢిల్లీలో 50కి పైగా పక్షులు మరణించాయని.. వాటిలో అధికంగా కాకులున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీటి నమూనాలను ల్యాబ్‌కు పంపించామని అధికారులు తెలిపారు.

హిమాచల్‌ప్రదేశ్‌లోని పోగ్‌ డ్యాం పరిసరాల్లో ఇప్పటి వరకూ 3,400 వలస పక్షులు వైరస్‌ సోకి మృతి చెందడం గమనార్హం. హరియాణాలో సైతం పంచకుల పరిసరాల్లోని కోళ్లఫాంలలో గత కొద్దిరోజులుగా 4లక్షల కోళ్లు చనిపోయాయని ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి జేపీ దలాల్‌ ప్రకటించారు. మరో 1.66లక్షలకు పైగా కోళ్లకు వైరస్‌ సోకినట్లు తెలుస్తోందని.. వాటన్నింటనీ వధించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. రాజస్థాన్‌లోని 11 జిల్లాలకు బర్డ్‌ఫ్లూ వ్యాపించింది. ఇప్పటి వరకూ 223 కాకులు, 11 నెమళ్లు, 55 పావురాలతో సహా 2,166 పక్షులు మృత్యువాత పడ్డాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు.

తెలంగాణలో ఎక్కడా బర్డ్‌ ఫ్లూ వైర్‌స్‌కు సంబంధించిన ఆనవాళ్లు లేవని, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి ఉందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ షకీల్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 కోట్ల కోళ్ల సంపద ప్రస్తుతం సురక్షితంగా ఉందని చెప్పారు. తెలంగాణలో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ ఆనవాళ్లు లేవన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1,300 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాయని వెల్లడించారు. పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్ల ఫాంల నుంచి నమూనాలు సేకరిస్తున్నారన్నారు. ఎక్కడా వైరస్‌ లక్షణాలు కనిపించలేదని డాక్టర్ షకీల్ వెల్లడించారు. ప్రజలు కోడి మాంసం తినటానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏ వైరస్‌ అయినా మాంసాన్ని వేడి చేయగానే, 60-70 డిగ్రీలకు ఉష్ణోగ్రతకు చేరగానే చనిపోతుందని... ఇక ఫ్రై చేసే సమయంలో నూనెల వేడికి 150 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు లేవు. చికెన్‌ నిర్భయంగా తినొచ్చని షకీల్ వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.