close
Choose your channels

నవ్యాంధ్రలో 'ఫ్రెండ్ రిక్వెస్ట్'

Monday, September 14, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మోడరన్‌ సినిమా పతాకంపై ఆదిత్యాఓం స్వీయదర్శకత్వంలో విజయ్‌వర్మ పాకలపాటి నిర్మాణ భాగస్వామ్యంలో రూపుదిద్దుకొంటున్న ''ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'' చిత్రం యానిమేషన్‌ టీజర్‌ లాంచ్‌, చిత్ర ప్రచారయాత్ర మరియు ఆడియో విడుదలకు నవ్యాంధ్ర రాజధాని నడిబొడ్డు మందడం గ్రామం వేదిక అయ్యింది. ఎ.పి.రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం శంఖుస్థాపన చేసిన మందడం గ్రామంలోనే తొలిసినిమా వేడుక జరపడం ద్వారా రాజధాని 29 గ్రామాల పరిధిలో జరిపిన తొలి సినిమా వేడుకగా ''ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌'' చిత్రం, అలాగే నిర్మాతలుగా ఆదిత్యాఓం, విజయ్‌వర్మ పాకలపాటిలు పేరు తెచ్చుకొన్నారు.

పార్లమెంట్‌ సభ్యులు రాయపాటి సాంబశివరావు, గుంటూరు జిల్లా జడ్‌.పి. ఛైర్మన్‌ రాయపాటి శ్రీనివాస్‌, మందడం గ్రామ సర్పంచ్‌ పద్మావతి, స్థానిక నాయకులు, అధికారులు హాజరై చిత్ర యూనిట్‌ సభ్యులను అభినందించారు. చిత్ర యూనిట్‌ మరియు ముఖ్య అతిథులకు స్థానిక దేవాలయానికి చెందిన వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలకగా, గ్రామీణులు స్వయంగా ముందుకు వచ్చి ఏర్పాటు చేసిన బ్యాండ్‌మేళం, ఇతర సాంస్కృతిక ఏర్పాట్లతో మందడం గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది. పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు, మాజీ జడ్‌.పి.ఛైర్మన్‌ రాయపాటి శ్రీనివాస్‌ల చేతులుమీదుగా యానిమేషన్‌ టీజర్‌ లాంచ్‌ మరియు చిత్రంలోని ఒక్క పాటని విడుదల చేయడం జరిగింది. అలాగే పచ్చజెండా ఊపి చిత్ర ప్రచార యాత్రను రాయపాటి సోదరులు ప్రారంభించారు.

రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ - ''చలనచిత్ర పరిశ్రమ నవ్యాంధ్ర రాజధానిలో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని, రాజధాని గ్రామంలో ఓ సినిమా వేడుకకు శ్రీకారం చుట్టడం ద్వారా నిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి, నటుడు, నిర్మాత, దర్శకుడు ఆదిత్యాఓంలు చరిత్రలో నవ్యాంధ్రరాజధానిలో తొలిసినిమా వేడుక జరిపిన వ్యక్తులుగా గుర్తుంటారని, చలనచిత్ర పరిశ్రమకు ఎలాంటి సహకారం కావాలన్నా తమ సహాయాన్ని అందిస్తాం'' అన్నారు.

రాయపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ - ''తొలి'' అనే పదానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో ''తొలి సినిమా వేడుక'' జరిపి ''విజయ్‌వర్మ-ఆదిత్యాఓం'' లు చాలా మంచి పనిచేశారు. ఈ స్ఫూర్తితో మరిన్ని సినిమా వేడుకలకు నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేదిక కావాలని ఆకాంక్షించారు.

ఆదిత్యాఓం మాట్లాడుతూ - విజయ్‌వర్మ సలహామేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపామని, ఇక్కడి ప్రజానీకం ఆదరణ చూస్తుంటే ఈ వేడుక ఇక్కడ జరపకుండా ఉండి ఉంటే చాలా మిస్‌ అయ్యేవాడినని అన్నారు. రాయపాటి సాంబశివరావుగారు మా చిత్రానికి అందిస్తున్న ప్రోత్సాహం ఎనలేనిదని, అలాగే సోషల్‌ మీడియాలో ప్రస్తుతం మేము చేస్తున్న పబ్లిసిటీకి యువతనుండి వస్తున్న రెస్పాన్స్‌ మమ్మల్ని మరింత ప్రోత్సహించేవిధంగా ఉందని, తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేవిధంగా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ చిత్రం ఉంటుందని అన్నారు.

విజయ్‌వర్మ పాకలపాటి మాట్లాడుతూ - నవ్యాంధ్రరాజధానిలో తొలిసినిమా వేడుక చేసిన ఘనత దక్కాలన్న తలంపుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, మా ఈ ప్రయత్నానికి రాయపాటి సోదరులు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. హైదరాబాద్‌తోపాటు అమరావతిలో సైతం చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు రాయపాటిగారు కృషి చేయాలని, స్టూడియోలు, షూటింగ్‌ వసతులు, సినీ రంగంలోవారికి ఇల్లు నిర్మించుకునేందుకు స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాలలో రెండు సినీకేంద్రాలు ఉన్న ఘనత తెలుగువారికి దక్కుతుందని అన్నారు. ఈ చిత్రంలోని ఒక్క పాటను మాత్రమే విడుదల చేయడం జరిగిందని, మిగిలిన మూడు పాటలను హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి లలో ఒక్కోపాట చొప్పున విడుదల చేయనున్నట్లు తెలిపారు.

నూతన రాజధానిలో తొలిసారిగా జరిగిన ఈ వేడుకలో భాగస్వాములు కావడంపట్ల హీరోయిన్‌లు మనీషాకేల్కర్‌, రీచాసోనీలు ఆనందం వ్యక్తం చేశారు. మందడం గ్రామ సర్పంచ్‌ పద్మావతి, పులిరాజా ఐ.పి.యస్‌. చిత్ర దర్శకుడు రాఘవలు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ యూనిట్‌కి తమ శుభాకాంక్షలు తెలియచేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.