close
Choose your channels

Pawan Kalyan: మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.. సముచిత స్థానం కల్పిస్తాం: పవన్ కల్యాణ్

Monday, February 19, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Pawan Kalyan: మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.. సముచిత స్థానం కల్పిస్తాం: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని.. టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా పార్టీ నాయకులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెట్టిన సేనాని.. పార్టీ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లారు. ఇద్దరు కలిసి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు. అనంతరం ఉమ్మడి విశాఖ జిల్లాల నేతలతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవుల్లో మూడింట ఒకవంతు పదవులు దక్కించుకుందామని తెలిపారు. 2019 ఎన్నికల తర్వాత పార్టీకి అండగా నిలిచిన వాళ్లకు తాను భరోసా ఇచ్చానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో జనసేనకు మరిన్ని పదవులు రాబోతున్నాయని పేర్కొన్నారు. ప్రజారాజ్యంలో ఉన్న చిన్న పరిచయంతో ఓ నేతకు రెండు సార్లు టీడీపీలో అవకాశం వచ్చేలా చేశానని గుర్తు చేశారు. ఏపీకి సుస్థిర పాలన అవసరమని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని నిపుణులు చెబుతున్నారని వెల్లడించారు. అలాగే పార్టీ నిధితో పాటు ఎన్నికల వ్యయం కోసం తన వంతుగా రూ.10 కోట్ల విరాళం ప్రకటించారు.

Pawan Kalyan: మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.. సముచిత స్థానం కల్పిస్తాం: పవన్ కల్యాణ్

వాలంటీర్ల పేరుతో రూ.617 కోట్ల అవినీతి..

మరోవైపు ఆ పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వాలంటీర్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'వాలంటీర్ వ్యవస్థను వైసీపీ వ్యవస్థగా చెబుతున్నారు. దీని గురించి జనసేనాని పవన్ మాట్లాడిన విషయాలపై కేసు నమోదు చేశారు. వారి కోసం ప్రతి ఏడాది రూ.1,560 కోట్లు ఖర్చు చేస్తుండగా.. 1,02,836 మంది వాలంటీర్ల డేటా నమోదు కాలేదు. దానిలో రూ.617 కోట్ల డేటా సేకరణ కోసం కేటాయించారు. ఈ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి. ఇంటింటి సమాచారం సేకరించాలని వారికి ఎవరు చెప్పారు.? ఈ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా.? అలా సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారు..? ఈ ప్రశ్నలు వేటికీ సమాధానం చెప్పకుండా మంత్రులు, వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. జనసేన పార్టీకి వాలంటీర్లపై ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదు..' అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై సీఎం జగన్ ఎప్పుడైనా మాట్లాడారా అని నిలదీశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ల పేరుతో దోచుకున్న డబ్బుపై విచారణ చేయిస్తామని ఆయన హెచ్చరించారు.

కాగా గతంలో వాలంటీర్లను కించపరిచేలా.. వారి మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేలా పవన్ కల్యాణ్‌.. అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో మార్చి 25న పవన్ కల్యాణ్‌.. గుంటూరు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos