పార్టీ మారడానికి సిద్ధమైన టీడీపీ ఎంపీ!
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతలు జంపింగ్లు షురూ చేశారు. రోజురోజుకు ప్రతిపక్ష వైసీపీ, జనసేనకు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు గోడ దూకిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం రోజు కూడా 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా గెలిచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. వైసీపీ అధినేత జగన్ను కలిసిన విషయం విదితమే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలువురు కాపు నేతలు, ప్రముఖులు వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ ఉన్నారని చెప్పుకొచ్చారు.
కాగా.. ఆమంచి పార్టీ మారి సరిగ్గా 24 గంటలు కూడా గడవకముందే అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ సైకిల్ దిగడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా అవంతి టీడీపీకి గుడ్ బై చెబుతారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వార్తలు గుప్పుమనడంతో అసలేంటి సంగతి అని ఆరాతీయగా... సన్నిహితులు, అభిమానులు, అనుచరుల ముందు అవంతి.. ‘పార్టీ మనకేం ఇచ్చింది.. ఇన్ని రోజులుగా పార్టీలో ఉన్నాం కదా మనకేం లాభం’ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వలేదని.. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోగా.. రానున్న ఎన్నికల్లో కూడా సీటిచ్చేది లేదని అధిష్టానం తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కాగా.. భీమిలి నుంచి పోటీ చేయాలని అవంతి తహతహలాడుతున్నారట. గతంలో వైసీపీ కీలకనేతలతో భీమిలీ సీటిస్తే పార్టీ తీర్థం పుచ్చుకుంటానని చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈసారి మళ్లీ భీమిలీ నుంచే పోటీ చేస్తానని.. అవసరమైతే తన కుమారుడ్ని కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలని మంత్రి గంటా శ్రీనివాసరావు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అవంతి ఆశలు ఆవిరయ్యాయి. అందుకే ఈసారి పార్టీ మారైనా సరే భీమిలి పోటీ చేయాలని దృఢ నిశ్చయంతో అవంతి ఉన్నారట. అయితే ఆయన రాజీనామా చేసి ఏ పార్టీలోకి వెళ్తారు..? ఎక్కడ్నుంచి పోటీ చేస్తారనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.