ఎమ్మెల్యేగా రాజీనామా చేసే జనసేనలో చేరతా..!
Send us your feedback to audioarticles@vaarta.com
బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనవరి 21న జనసేన కండువా కప్పుకోనున్న సంగతి తెలిసిందే. విజయవాడలో జనసేన అధినేత పవన్ సమక్షంలో తాను పార్టీలో చేరుతున్నట్లు స్వయాన ఆకులే ప్రకటించారు. అయితే పార్టీ నేతలు, విమర్శకుల నుంచి విమర్శలు రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్త పడ్డ ఆయన పార్టీకి, ఎమ్మె్ల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే జనసేన తీర్థం పుచ్చుకుంటానన్నారు. స్పీకర్ ఫార్మాట్లో తన రాజీనామా లేఖను పంపుతానని.. అదే విధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సైతం లేఖ ఫ్యాక్స్ చేస్తానని ఆకుల మీడియాకు వివరించారు.
ఇప్పటికే ఈ చేరిక విషయమై పవన్తో భేటీ అయి చర్చించానని.. ఈనెల 21న ఉదయం 11 గంటలకు పార్టీలో చేరుతున్నట్లు ఆకుల సత్యనారాయణ ప్రకటించారు. ఆకులతో పాటు ఆయన సతీమణి లక్ష్మీపద్మావతి కూడా అధికారికంగా జనసేన కండువా కప్పుకోబోతున్నారు. తన భార్య జనసేన పార్టీ పెట్టినప్పట్నుంచి ఉందన్నారు. మొత్తానికి బీజేపీకి బై బై చెప్పేసి జనసేన కండువా కప్పుకోబోతున్నారు. భారీగా అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి విజయవాడకు వెళ్లి పవన్ సమక్షంలో ఆకుల దంపతులు జనసేనలో చేరబోతున్నారు.
కాగా ఆకుల దంపతుల్లో ఒకరికి ఎంపీ, మరొకరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని పవన్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఆయన జనసేనలో చేరుతున్నారని సమాచారం. అయితే ఎప్పట్నుంచో ఆకులకు ఎంపీ అయ్యి పార్లమెంట్కు వెళ్లాలని కల. 2014 ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ రెండూ కలిసి ఒకే అభ్యర్థిని బలపరిచి బరిలోకి దింపడంతో ఆకుల ఎలాంటి ఇబ్బందుల్లేకుండా గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో ఈ దంపతుల పరిస్థితి ఎలా ఉండబోతోంది..? దంపతులిద్దరూ గెలుస్తారా..? లేదా అనే విషయం తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.