చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదు!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో రాజకీయాలు ఎంత రసవత్తరంగా ఉంటాయో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎన్నికలకు ముందు అధికార, ప్రతిపక్ష పార్టీలు వేసే ఎత్తులు అన్నీ ఇన్నీగావు. ఇప్పటికే ‘నవరత్నాలు’ వైసీపీ జనాల్లోకి దూసుకెళ్తోంది.. అయితే ‘తాడిని తన్నేవాడుంటే.. దాని తలదన్నేవాడుంటాడు’ అనే చందంగా 40 ఇయర్స్ ఇండస్ట్ట్రీ ఇక్కడ మా ముందు మీ నవరత్నాలెంత అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో హామీ ఇస్తూ.. ఎలాగైనా సరే మళ్లీ సీఎం పీఠం దక్కించుకోవాలని చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇంటింటి స్మార్ట్ ఫోన్, పేదోడికి ఇళ్లు, సంక్రాంతి తర్వాత రైతు రుణమాఫీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు.. తాజాగా పెన్షన్ రూ. 2వేలకు పెంచుతున్నట్లు చేసిన ప్రకటన చిచ్చు పెట్టింది.!
నంద్యాల ఉప ఎన్నికల్లోనే నవరత్నాలను వైఎస్ జగన్ ప్రకటించారు.. అప్పట్లో అసలు ఇది సాధ్యమవుతుందా..? రాష్ట్ర బడ్జెట్ సరిపోతుందా..? అంటూ ప్రతిపక్షనేతపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. అయితే ఇటీవల మాత్రం అదే రెండు వేల రూపాయిలు తాను పెంచుతున్నానని.. వచ్చే నెల ఫిబ్రవరి నుంచి అమలవుతుందని స్పష్టం చేశారు. దీంతో మా పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టారంటూ వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఒక్కొక్కరుగా మీడియా ముందుకొస్తున్న వైసీపీ నేతలు.. చంద్రబాబుపై దుమారం రేపే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం వైసీపీ సీనియర్ నేత శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడారు.
రాజకీయ సమాధి తప్పదు..!
" వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఓ చారిత్రాత్మకం. ప్రజా సంకల్పయాత్ర ద్వారా జగన్.. ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రతివర్గాన్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. వైఎస్ జగన్ నవరత్నాల ప్రకటనతో చంద్రబాబుకు మతి భ్రమించింది. బాబు ప్రకటించిన 2వేల పింఛన్ కేవలం మూడు నెలల కోసమే. తమ ఓటుతో తెలంగాణ ప్రజలు చంద్రబాబును ఏపీ వరుకు తరిమికొట్టారని.. ఇక్కడ కూడా చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదు. కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు సాధిస్తాం" అని శిల్పా ధీమా వ్యక్తం చేశారు.
భయంతో పెన్షన్ పెంపు..!
" జగన్ పాదయాత్ర ప్రజల్లో భరోసా నింపింద. పాదయాత్ర వచ్చిన స్పందనకు భయపడే చంద్రబాబు పెన్షన్లు పెంచారు. చంద్రబాబు పెన్షన్లు పెంచడం వైయస్ జగన్ విజయమే. ఏపీకి హోదా కోసం వైఎస్ జగన్ మొదట్నుంచి పోరాడారని.. ఆ తర్వాత హోదాపై చంద్రబాబు యూటర్న్ తీసుకుని జగన్ బాటలోకి వచ్చారు. చంద్రబాబుపై ఉన్న కేసులపై స్టే ఎత్తివేస్తే జైలుకు వెళ్ళాల్సి వస్తుందని కాంగ్రెస్ పంచన చేరారు. టీడీపీ నేతలు అడుగడుగునా అవినీతికి పాల్పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటన కేసు ఎన్ఐఏకి అప్పగించినా పక్కదారి పట్టించాలని చంద్రబాబు యత్నిస్తున్నారు"అని కొలగట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీ నేతల వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్ల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.