మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్(81) తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని ఎస్కార్ట్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె మృతితో షీలా ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. షీలా దీక్షిత్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు. కాగా ఏళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేరళ గవర్నర్గా షీలా దీక్షిత్ సేవలు అందించారు.
జననం..!
షీలా దీక్షిత్ ఒక పంజాబీ ఖత్రి కుటుంబంలో 1938 మార్చి 31న (పంజాబ్) కపుర్తలలో షీలా దీక్షిత్ జన్మించారు. ఈమె న్యూఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ స్కూల్ లో కాన్వెంట్ విద్యను అభ్యసించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మిరాండా హౌస్ నుండి చరిత్రలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీలో పట్టభద్రులైనారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నవో జిల్లాకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్)గా పనిచేసిన వినోద్ దీక్షిత్తో ఈమె వివాహం జరిగింది. దీక్షిత్ మహిళా సంఘం అధ్యక్షురాలిగా పనిచేశారు. వీరికి సందీప్ దీక్షిత్, లతికా దీక్షిత్ సయ్యద్ అనే ఇద్దరు పిల్లలున్నారు. 1970లో ఢిల్లీలో మహిళల పని కోసం అత్యంత విజయవంతమైన వసతిగృహాలు రెండు ఏర్పాటయ్యేందుకు కారణమయ్యారు. ఈమె తరువాత ఎగ్జిక్యూటివ్ కార్యదర్శిగా కూడా పనిచేశారు.
రాజకీయ జీవితం..!
1984 మరియు 1989 మధ్య కాలంలో ఈమె ఉత్తరప్రదేశ్ కనౌజ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంట్ సభ్యురాలిగా, ఈమె లోక్ సభ అంచనాల కమిటీకి సేవలందించారు. ఆ తర్వాత 1998 నుంచి 2013 వరకు ఆమె ఢిల్లీ సీఎంగా పనిచేసిన విషయం విదితమే. 2017 మార్చి నుంచి ఆగస్టు వరకు కేరళ గవర్నర్గా ఆమె పనిచేశారు. అంతేకాదు 2019 సార్వత్రిక ఎన్నికల ముందే ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన షీలా.. బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారి చేతిలో ఓడిపోయారు.
ఆరోపణలు ఇవీ..
షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని కాగ్ నివేదిక ఇచ్చింది. అప్పట్లో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే, కాంట్రాక్టుల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి పాత్ర ఏ మాత్రం లేదని అప్పటి చీఫ్ సెక్రటరీ పీకే త్రిపాఠీ తేల్చడంతో ఊరట లభించినట్లైంది. అంతేకాదు.. షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్భయ గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటనతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.